ఆమె రోజుకి 23 గంటలు కదల్లేని స్థితిలో మంచం మీదే ఉంటుంది. రోజుకు కనీసం 10 సార్లు వాంతులు, మూర్చలు రావడంతో నరకం చూస్తోంది. ఆమెకు వచ్చిన వింత వ్యాధి గురించి తెలుసుకోడానికి ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. కానీ, వైద్యులు స్పష్టంగా ఆమెకు వచ్చిన వ్యాధి గురించి చెప్పలేకపోయారు. దీంతో ఆ మహిళే తన వ్యాధికి పేరు పెట్టుకుంది. అదే ‘అలర్జీ ఆఫ్ గ్రావిటీ’. కనీసం రెండు నిమిషాలు కూడా నిలబడలేని దయనీయమైన దుస్థితి ఆమె.


అమెరికాకు చెందిన 28 ఏళ్ల లిండీ జాన్సన్ ఒకప్పుడు యూఎస్ నేవీలో పనిచేసేది. కానీ, ఇప్పుడు ఆమె ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. ప్రపంచంలోనే అతి తక్కువ మంది అర్థం చేసుకునే వ్యాధిగా దీన్ని చెప్పుకొస్తున్నారు. ఆమె కనీసం మూడు నిమిషాలు కూడా నిలబడలేదు, అందరిలా కాళ్ళు చాపి కూర్చోలేదు, నిలబడలేదు, నడవలేదు. 2015 లో జాన్సన్ పొత్తికడుపు, వెన్నునొప్పి వచ్చింది. సంవత్సరాలు గడిచే కొద్ది ఆమెలో ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. రోజుకి కనీసం 10 సార్లు  విపరీతంగా వాంతులు చేసుకోవడం, మూర్ఛపోవడం జరిగింది. కొన్నేళ్ళ పాటు వైద్యుల చుట్టూ తిరిగిన తర్వాత 2022లో ఆమెకి ఆర్థోస్టాటిక్ టాచికార్డియా సిండ్రోమ్(PoTS) వచ్చినట్లు నిర్ధారించారు.


ఈ అరుదైన వ్యాధి వచ్చిన వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గి హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది. జాన్సన్ తన వ్యాధికి ‘అలర్జీ ఆఫ్ గ్రావిటీ’గా పేరు పెట్టారు. ఆమె మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు నిలబడలేదు. మంచం మీదే రోజంతా గడపాల్సి వస్తుంది. తన పరిస్థితి గురించి చెప్తూ బాధపడింది. ‘ఇకపై నేను ఇంటి నుంచి బయటకి ఎక్కడికి వెళ్లలేను. నా సొంత పనులు కూడా లేచి చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను’ అని చెప్పుకుని చాలా ఆవేదన పడ్డారు.  


‘‘అనారోగ్యం కారణంగా నేవీ నుంచి 2018లో బయటకి వచ్చాను. నొప్పితో చాలా అల్లాడిపోయేదాన్ని. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను. కానీ ఎవరు నాకు వచ్చిన వ్యాధి ఏమిటనేది గుర్తించలేకపోయారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడం, వాంతులు, మూర్ఛ పోవడం వంటి సమస్యలతో బాధపడేదాన్ని. 2022లో నా పరిస్థితి మరింత దిగజారింది. వంగడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. తర్వాత నన్ను పరిశీలించిన కార్డియాలజిస్ట్ నాకు PoTS ఉందని అనుమానించి పరీక్షలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాకు ఆ వ్యాధి ఉన్నట్టు వైద్యపరంగా నిర్ధారించారు. ఇప్పటికైనా నాకు వచ్చిన వ్యాధి ఏమిటో గుర్తించగలిగారు. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమె వెల్లడించారు.


ప్రస్తుతం జాన్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉండి ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స వల్ల ఇప్పుడు తన పరిస్థితి మెరుగుపడింది. అయినప్పటికీ తను అందరిలాగా సాధారణ జీవితం గడపలేదు. తన భర్త జేమ్స్ మీదే అన్నిటికీ ఆధారపడి ఉంటుంది. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ జాన్సన్ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు బెడ్ మీదే ఉంది డిగ్రీ చేస్తోంది. తన ఉద్యోగంలో మళ్ళీ చేరి ఇంటి నుంచి పని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.    


Also Read: పచ్చి అల్లం VS సొంటి పొడి, ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ప్రయోజనాలేమిటీ?


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకుంటున్నారా? అవి ప్రాణాంతక వ్యాధులకు సంకేతం కావచ్చు