ప్రపంచంలో దాదాపు మూడున్నరకోట్ల మంది ఎయిడ్స్ వ్యాధికి బలైపోయారు. ప్రస్తుతం మూడున్నరకోట్ల మందికి పైగా ఇంకా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే వీరిలో 70 శాతం మంది ఆఫ్రికా దేశాల్లోనే జీవిస్తున్నారు. మిగతా 30  శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారు. గత 40 ఏళ్లుగా ఎయిడ్స్ మనుషులను బాధిస్తున్నప్పటికీ... దీని లక్షణాలు ఏమిటో తెలియని వాళ్లు ప్రపంచంలో ఎక్కువమందే ఉన్నారు. 


ఎయిడ్స్ లక్షణాలు ఇవే..
1. జ్వరం
2. రాత్రిళ్లు చెమటలు పట్టడం
3. బరువు తగ్గడం
4. కడుపునొప్పి
5. పొడి దగ్గు
6. ఒళ్లు నొప్పులు
7. విరేచనాలు, వాంతులు
8. నాలుక రంగు మారడం (తెల్లగా)
9. చర్మంపై దద్దుర్లు,
10. నొప్పితో కూడా వాపు
11. పుండ్లు
12. గొంతుమంట


ఎయిడ్స్ కు చికిత్స లేనప్పటికీ, యాంటీ రెట్రో వైరల్ విధానాలకు కట్టుబడి ఉండటం వల్ల వ్యాధి పురోగతిని తగ్గించవచ్చు. ఎయిడ్స్ వ్యాధి లక్షణాలను తగ్గించి సాధారణంగా జీవించేలా చేయడంలో ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. హెచ్ఐవీ వైరస్ సంక్రమణ సమయంలో రోగనిరోధక కణాలకు అదనంగా పోషకాలు అవసరం పడతాయి. ఆ వైరస్ సోకిన వారు విటమిన్ ఎ, విటమిన్ బి, జింక్, ఐరన్ లోపాలతో బాధపడుతుంటారు.  అందులోనూ ఎయిడ్స్ రోగులకు యాంటీ రెట్రోవైరల్ మందులు ఇస్తారు. ఈ మందులు పోషకాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి సరైన పోషకాహారం తినడం వల్ల ఎయిడ్స్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. 


ఏం తినాలి?
1. రోగినిరోధక శక్తికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, డి, ఇ, ఎ, జింక్, సెలీనియం, ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ పోషకాలు పుష్కలంగా ఉన్నఆహారాన్ని రోజూ తినాలి. అలాగే నిమ్మ, ద్రాక్ష, నారింజ, మోసంబి వంటి సిట్రస్ పండ్లను తినాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే సీజనల్ పండ్లు అయినా పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి వంటివి కూడా ఆయా సీజన్లలో తినాలి. ఎరుపు, పసుపు క్యాప్సికం, గుమ్మడికాయను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. 
2. ఐరన్ కోసం రోజూ ఆకుకూరలతో వండిన వంటకాలు తీసుకోవాలి. 
3. నీరసం, బలహీనత, కండరాల నొప్పులు తగ్గించేందుకు అధికప్రోటీన్ కల ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చికెన్, మటన్, చేపలు తినాలి. 


వికారం, వాంతులు తగ్గేందుకు..
1. భోజనం ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా, రోజులో నాలుగైదుసార్లు కొంచెంకొంచెంగా తినాలి. 
2. ఎక్కువసేపు ఖాళీ పొట్టతో ఉండకూడదు. 
3. తినేసిన వెంటనే నిద్రపోవడం మానేయాలి. అలాగే తిన్న వెంటనే పడుకోకూడదు. కూర్చోవడం, లేదా ఇటూ అటూ నడవడం చేయాలి.
4. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. 


ఏం తినకూడదు
1. పచ్చిగుడ్లను ఎప్పుడూ తినవద్దు.
2. సరిగా వండని చికెన్, మటన్, చేపలు. ఇవి తినాలనుకుంటే బాగా ఉడికినవే తినాలి. 
3. పాశ్చరైజ్ చేయని పాలు లేదా పాల ఉత్పత్తులు, పండ్ల రసాలకు కూడా దూరంగా ఉండాలి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Read Also: కొత్త వేరియంట్ కమ్ముకుంటున్న వేళ... ఎవరికి బూస్టర్ డోస్ అవసరం?
Read Also:  అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Read Also: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి