2022కు వీడ్కోలు పలికే రోజు వచ్చేసింది, 2023 స్వాగతం పలికేటప్పుడు మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ జనాభా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. ఈ ఏడాది ఆరోగ్యం ఉండడమే మీ సరికొత్త రిజల్యూషన్ కావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, అందుకు తగ్గట్టే తినడం, వ్యాయామం చేయడం చేస్తామని మీకు మీరే ప్రమాణం చేసుకోవాలి. ఈ వాగ్దానం వేరే వాళ్లకి కాదు, మీకు మీరే మాట ఇచ్చుకోవాలి.  అనారోగ్యకరమైన జీవనశైలిని ఆరోగ్యకరమైనదిగా మార్చుకోవడం వెంటనే జరగదు, ఇది కాస్త నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అది మీ కష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు, పాటించాల్సిన పనులు ఏంటంటే...


ఆకుపచ్చ కూరగాయలు
మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగయాలు, ఆకుకూరలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.అలాగే సీజనల్ పండ్లను, కాయగూరలను కూడా కచ్చితంగా తినాలి. ముఖ్యంగా పాలకూర, బచ్చలి కూర, మెంతి కూర, బ్రకోలీ, క్యాబేజీ వంటివి మీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 


తాజాగానే తినాలి
ప్రాసెస్ చేసిన ఆహారాలను మానేసి అన్నీ తాజాగా ఉండే ఆహారాలనే ఎంచుకోవాలి. మూడు పూటలా తినే ఆహారం తాజా కూరగాయలు, పదార్థాలతోనే తయారు చేసుకోవాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తినడం మానేయాలి.ఇంట్లో తయారు చేసిన ఆహారిన్ని తినేందుకు ప్రయత్నించాలి. బయటి నుంచి ఆర్డర్లు తక్కువ చేయండి. 


బాగా నమలాలి
చాలా మంది చిన్న చిన్న ముద్దలు నోట్లో పెట్టుకుని రెండు సార్లు నమిలి మింగేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఆహారాన్ని బాగా నమిలి మింగడం మంచిది. నోట్లోనే బాగా నమలడం వల్ల పొట్టపై భారం తగ్గుతుంది. అంతేకాదు శరీరం అధికంగా పోషకాలను గ్రహిస్తుంది. సరిగ్గా నమలకుండా ఆహారాన్ని మింగడం వల్ల బరువు పెరుగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


80% నిండితే ఆపేయండి
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే మొదటి గోల్డెన్ రూమ్ ఏంటో తెలుసా? పొట్ట నిండా పట్టేసినట్టు తినేయకండి. 80 శాతం పొట్టి నిండినట్టు అనిపిస్తే వెంటనే తినడం ఆపేయండి. ఇలా చేయడం వల్ల చురుగ్గా ఉంటారు. బద్దకంగా అనిపించదు. జీర్ణక్రియ సున్నితంగా జరుగుతుంది. బరువు కూడా త్వరగా పెరగరు. 


చిరు ధాన్యాలు
ఎప్పుడు బియ్యంతో వండిన అన్నమే కాదు, జొన్నలు,రాగులు, సజ్జలు వంటివాటితో చేసిన ఆహారాలు కూడా తినాలి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి శక్తిని ఇస్తాయి. 


తగినంత నీళ్లు
శరీరాన్ని హైడేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి రోజులో కచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజువారీ ఆహారంలో నీటితో నిండిన పండ్లు, కొబ్బరినీరు, నిమ్మరసం వంటివి తాగుతూ ఉండాలి. 


ఉప్పు, చక్కెర వద్దు
ఈ రెండు ఆరోగ్యాన్ని చెడగొట్టే ముఖ్యమైన పదార్థాలు. ఉప్పు, శుద్ధి చేసిన చక్కెర ఈ రెండు అధిక బీపీ, మధుమేహం సమస్యలను పెంచేస్తాయి. అలాగని ఉప్పు పూర్తిగా వాడొద్దని చెప్పడం లేదు, తగ్గించుకోవాలి. ఉప్పు పూర్తిగా వాడకపోయినా శరీరంలో అయోడిన్ లోపానికి కారణం కావచ్చు. అదేవిధంగా, చక్కెరకు బదులుగా తేనె, బెల్లం వాడుకోవచ్చు.


Also read: కొత్త ఏడాదిలో మీ అదృష్టాన్ని మార్చే ఆహారాలు ఇవే, ఇలా చేస్తే అంతా మంచే


























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.