ఆకలిగా ఉంటే ఏం చేస్తాం? అన్నం తింటాం, లేదంటే, పండ్లు తింటాం. అదీ కాదంటే ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటాం. కానీ, ఓ 32 ఏళ్ల యువకుడు ఏం చేశాడో తెలిస్తే తప్పకుండా షాకవుతారు. ఎందుకంటే, అతడు గత ఏడాదిగా చేతికి దొరికిన స్పూన్లను మింగేస్తున్నాడు. అలా తినీ, తినీ పొట్ట నిండిపోవడంతో కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఏడుపు ముఖం పెట్టుకుని డాక్టర్లను ఆశ్రయించాడు. వైద్యులు అతడి కడుపును పరిశీలించి షాకయ్యారు. కడుపు నిండా స్పూన్లు ఉన్నాయని తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ షాకింగ్‌ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడి కడుపులో ఏకంగా 63 స్టీల్‌ స్పూన్లు ఉండటం చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ చేసి ఆ స్పూన్లను బయటకు తీశారు.

  


కడుపు నొప్పికి కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయిన డాక్టర్లు


ముజఫర్‌ నగర్‌ చెందిన విజయ్ కుమార్ అనే 32 ఏండ్ల యువకుడు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజు రోజు మద్యానికి మరింత బానిస కావడంతో..  పరిస్థితి చేయిదాటిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే అతడిని డి-అడిక్షన్ సెంటర్ కు తీసుకెళ్లారు. కొంత కాలంగా అక్కడే ఉంచారు. ఇటీవల కడుపునొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. మద్యం తీసుకోకపోవడం వల్లే ఇబ్బంది అవుతుందేమోనని భావించారు. ఆయన చెప్పిన మాటలను లైట్ తీసుకున్నారు. కానీ, అతడికి మరోసారి తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. విజయ్‌ను పరిశీలించిన డాక్టర్లు పలు పరీక్షలు చేశారు. ఆయన టెస్టు రిపోర్టులు చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.   


రెండున్నర గంటల పాటు ఆపరేషన్, 63 స్పూన్లు వెలికితీత


విజయ్ కడుపులో పెద్ద మొత్తంలో స్టీల్ స్సూన్లు ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత డాక్టర్లు విజయ్ కి ఆపరేషన్ చేయాలని భావించారు. కొంత మంది డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి సుమారు రెండున్నర గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగించారు. అతడి పొట్టలో నుంచి ఏకంగా 63 స్పూన్లు బయటకు తీశారు. అన్ని స్పూన్లు కడుపు ఉండటం పట్ల వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ తర్వాత స్పూన్లు కడుపులోకి ఎలా వెళ్లాయి? అనే అంశం గురించి ఆరా తీశారు. తానే ఏడాది కాలంగా  స్పూన్లను తింటున్నానని చెప్పడంతో డాక్టర్లు షాక్ అయ్యారు. మరోవైపు డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకులే విజయ్ చేత బలవంతంగా స్పూన్లు తినిపించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ, పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం విజయ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. సర్జరీ తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఇన్ఫెక్షన్ తగ్గితే ప్రాణాలతో బయటపడే అవకాశాలున్నాయి. చూశారుగా, మీ పిల్లలు కూడా ఒక్కోసారి వస్తువులను మింగేస్తుంటారు. అది అలవాటుగా మారితే చాలా ప్రమాదం. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. 


Also Read: డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు