నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజమేనని చెబుతున్నారు పరిశోధకులు. మహిళలు బిస్కెట్లు, కేకులు తినడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.  క్రమం తప్పకుండా రోజూ అధికంగా బిస్కెట్లు, కేకులు తినే అలవాటున్న స్త్రీలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. స్వీడన్ దేశానికి చెందిన స్టాక్ హోమ్ లోని కరోలింక్సా ఇన్స్టిట్యూట్ వారు ఈ  అధ్యయనాన్ని నిర్వహించారు. తీపి పదార్థాలు తినడానికి, క్యాన్సర్ కు మధ్య ఏదైనా సంబంధం ఉందేమో తెలుసుకోవడానికి వారు ఎన్నోఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలో మహిళలకు బిస్కెట్లు, కేకుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్టు బయటపడింది. 


పదేళ్ల పాటూ పరిశీలించి...
ఈ పరిశోధన కోసం స్వీడన్ లో దాదాపు 60,000 మందికి పైగా మహిళల ఆహారపు అలవాట్లను పదేళ్ల పాటూ పరిశీలించారు. వారిలో వారానికి రెండు మూడు సార్లు కేకులు, బిస్కెట్లు అధికంగా తినే అలవాటు కలిగినవారు చాలా మంది ఉన్నారు. వారిలో 33 శాతం మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నట్టు బయటపడింది. అదే వారానికి మూడు సార్లు కన్నా ఎక్కువ సార్లు కేకులు, బిస్కెట్లు తినే వారిలో క్యాన్సర్ కణితిలు వచ్చే అవకాశం 42 శాతం పెరిగినట్టు తేలింది. బరువు పెరగడం వల్ల కూడా ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. 


1987లో ఆహారం, జీవనశైలి, బరువు, ఆరోగ్యం తదితర అంశాలపై  60,000 మంది మహిళలకు ప్రశ్నావళిని అందించారు.  పదేళ్ల తరువాత వారిలో సజీవంగా ఉన్నవారికి తిరిగి అదే ప్రశ్నావళిని అందించారు. ఆ రెండు సార్లు వారిచ్చిన సమాధానాల డేటాను పరిశీలించారు. వారిలో 729 మందికి గర్భాశయ క్యాన్సర్ వచ్చినట్టు తేలింది. వారిలో స్వీట్లు శీతల పానీయాలు, జామ్ లాంటి అధిక చక్కెర పదార్థాలను తినే వాళ్లలో ప్రమాదస్థాయిలు ఎక్కవగా కనిపించలేదు. కానీ విచిత్రంగా ఎవరైతే తీపి బన్ లు, బిస్కెట్లు అల్పాహారంగా తీసుకుంటారో వారిలోనే 42 శాతం అధికంగా క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపించింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. 


చక్కెరతోనే ప్రమాదం
ఆహారపదార్థాల ద్వారా రోజుకు 35 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను అంటే ఏడు టీస్పూన్లతో సమానమైన చక్కెరను తీసుకునేవారిలో క్యాన్సర్ ప్రమాదం 36 శాతం అధికమైనట్టు చెబుతున్నారు అధ్యయనకర్తలు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చక్కెర పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్నిఅనేక విధాలుగా పెంచుతాయి. శరీరంలో షుగర్ శాతం ఎక్కువైనప్పుడు శరీరం మరింత ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఇది గర్భాశయంలోని ఎండోమెట్రియల్ లో కణాల సంఖ్యను పెంచుతుంది. పెరిగిన కణాలు కణితిలా మారి క్యాన్సర్ గా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈస్ట్రోజెన్ హార్మోను స్థాయిలను అధికంగా పెంచుతుంది షుగర్. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: గోళ్లకు వచ్చే అరుదైన క్యాన్సర్... చెక్ చేసుకోవడం ఇలా


Also read: ఎట్టకేలకు డెంగూ జ్వరానికి ఔషధం... కనిపెట్టిన లక్నో శాస్త్రవేత్తలు


Also read: కొరియన్ అమ్మాయిలు సన్నగా, మెరుపుతీగల్లా ఎలా ఉంటారు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి