రువు తగ్గాలని వేసుకునే ప్లాన్స్ లో ఎక్కువగా తినకూడని ఆహార పదార్థాలు జాబితా ఉంటుంది. తిండి తగ్గించుకుంటున్నాం కదా బరువు తగ్గుతాములే అనుకుంటారు. మరి తీసుకునే పానీయాల సంగతి ఏంటి? వెయిట్ లాస్ డైట్ లో ఉన్నా కూడా కొంతమంది కాఫీ, టీ తాగేస్తూనే ఉంటారు. అయితే ఇవి రహస్యంగా శరీరంలో కేలరీలని పెంచుతాయి. అవి బరువు తగ్గించే అవకాశం లేకుండా చేస్తాయి. అందుకే ఆహారంతో పాటు ఈ పానీయాలు కూడా దూరం పెట్టారంటే బరువు తగ్గాలనుకునే మీ లక్ష్యం చక్కగా చేరుకుంటారు.


కాఫీ


అందరికీ ఎంతో ఇష్టమైంది కాఫీ. పొద్దున్నే వేడి వేడి కాఫీ తాగుతూ ఉంటే మనసుకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కానీ బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మాత్రం కాఫీ తీసుకుంటే బరువు పెరిగిపోతారు. ఎందుకంటే కెఫీన్ సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కానీ చక్కెర, మితిమీరిన చిక్కటి పాలు, క్రీమ్ జోడించుకుని మరీ కాఫీ తాగారంటే మాత్రం వెయిట్ లాస్ డైట్ కుంటుపడినట్టే. ఇలా కెఫీన్ తీసుకోవడం వల్ల కేలరీల సంఖ్య పెరుగుతుంది. పాలతో చేసిన కాఫీ కంటే బ్లాక్ కాఫీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బరువు నిర్వహణలో సహాయపడే కొన్ని మసాలా దినుసులు దానితో జోడించుకుని తీసుకుంటే మరీ మంచిదని సిఫార్సు చేస్తున్నారు.


ప్రీమిక్స్డ్ టీ


బరువు తగ్గే విషయంలో ప్రీమిక్స్డ్ టీ అత్యంత ఎక్కువ మంది తీసుకుంటారు. కానీ దీనిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. రుచిగా ఉంటుంది కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు నిపుణులు. శరీరంలో చక్కెర స్థాయిని మాత్రమే పెంచుతుంది. దీనికి బదులుగా హెర్బల్ టీ వంటి వాటిని ఎంచుకోవడం ఉత్తమం.


కార్బొనేటెడ్ పానీయాలు


శీతల పానీయాలు, సోడా ఆధారిత ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల దాహం అయితే తీరుతుంది. కానీ దీని వల్ల బరువు పెరుగుతారు. ఈ పానీయాలు చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి తక్షణమే శక్తిని అందజేస్తాయని అనుకుంటారు. ఒక్కసారిగా వచ్చిన శక్తి తగ్గిపోయి తర్వాత శరీరం డీహైడ్రేట్ అయ్యేలా చేస్తుంది. రక్తంలో చక్కెర, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.


మద్యపానీయాలు


ఆహారం తీసుకునేటప్పుడు చాలా మంది వైన్, బీర్, ఇతర ఆల్కాహాలిక్ డ్రింక్స్ తీసుకుంటారు. కానీ దీని వల్ల కేలరీల సంఖ్య పెరుగుతుంది. నిజానికి డిన్నర్ తో కలిపి ఆల్కహాలిక్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కేలరీల సంఖ్య మరింత పెరుగుతుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక వెల్లడించింది. ఇవి మెటబాలిక్, కార్డియాక్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.


పండ్ల రసాలు


పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవి అని అందరూ అనుకుంటారు. కానీ వాటి కంటే తాజాగా ఉన్న పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పండ్ల రసాలు మరింత రుచిగా ఉండేందుకు అందులో చక్కెర జోడిస్తారు. ఇవి కేలరీలని పెంచేస్తాయి. చక్కెర బరువు పెరగడానికి మాత్రమే కాదు ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే జ్యూస్ కి బదులు పండ్లు ఎంచుకోవడం ఉత్తమం.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జుట్టు సమస్యలకి చెక్ పెట్టేందుకు స్కాల్ఫ్ సీరమ్? దీని వల్ల ప్రయోజనాలేంటంటే