కరోనా పూర్తిగా అంతంకాలేదు. పిల్లలు వ్యాక్సిన్లు కూడా రాలేదు. పాఠశాలలు మాత్రం మొదలైపోయాయి. ఇలాంటి సమయంలో పిల్లల ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం అత్యవసరం. టేస్టీగా ఉంటూనే, ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని చేసి పెట్టడం తల్లి విధి. ఇదిగో ఇలా కొత్తిమీర రైస్ చేసి పెడితే వారికి పోషకాలు అందడంతో పాటూ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చేయడం కూడా చాలా సులువు. 

Continues below advertisement


కావాల్సిన పదార్థాలు:
బియ్యం - 250 గ్రాములు
బిర్యానీ ఆకు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్లు - ఒకటి (మీడియం)
గ్రీన్ పీస్ - అరకప్పు
కొత్తిమీర - రెండు కట్టలు
పచ్చిమిర్చి - రెండు
వెల్లుల్లి రెబ్బలు - అయిదు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడా
పుదీనా - గుప్పెడు ఆకులు
అల్లం ముక్క - చిన్నది
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - మూడు
యాలకులు - రెండు
ధనియాల పొడి - అరటీ స్పూను
జీలకర్ర పొడి - అర టీస్పూను


తయారీ విధానం
1. ముందుగా అన్నం వండి ఒక ప్లేటులో ఆరబెట్టాలి. ఇలా చేయడం మెతుకులు అతుక్కోకుండా విడివిడిగా అవుతాయి. 
2. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, అల్లం ముక్క, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కలిపి మెత్తని పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 
3. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ వేసి బాగా వేయించాలి. 
4. బాగా వేగాక ముందుగా పేస్టులా చేసి పెట్టుకున్నా కొత్తిమీర పేస్టుని కూడా వేసి వేయించాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేయాలి. చిటికెడు పసుపును కూడా కలపాలి.
5. మిశ్రమం బాగా వేగాక అందులో ముందుగా వండి ఆరబెట్టుకున్న అన్నాన్ని కలపాలి. 
6. అర టీస్పూను జీలకర్ర పొడి, అరటీస్పూను ధనియాల పొడి కూడా చల్లి, బాగా కలిపి చిన్న మంటపై ఉంచాలి. 
7. ఓ మూడు నిమిషాల తరువాత స్టవ్ కట్టేయాలి. యమ్మీయమ్మీగా కొత్తిమీర రైస్ సిద్ధమైనట్టే. రైతాతో దీన్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 


పోషకాలు
క్యారెట్లు, గ్రీన్ పీస్, కొత్తిమీర... ఈ మూడు రోగనిరోధక శక్తి పెరుగుదలకు సహకరించేవే. ముఖ్యంగా కొత్తిమీర మంచి కొలెస్ట్రాల్ ని పెంచి, చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కడుపులో మంటలాంటివి కలుగకుండా కాపాడతాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశాల్ని కొత్తిమీరు తగ్గిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. మెమోరీ పవర్ పెంచి మతిమరుపు వ్యాధి దరి చేరకుండా కాపాడుతుంది. కనుక రోజువారీ ఆహారంలో కొత్తిమీరను భాగం చేసుకుంటే మంచిది. 


Also read:కోటి రూపాయలు గెలిచిన హిమానీ కంటి చూపు పోవడం వెనుక విషాద కథ
Also read: పని ఒత్తిడి పెరుగుతోందా... మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ముప్పు ఎక్కువ