South Indian Masala Dosa Recipe : మీకు మసాలా దోశ అంటే ఇష్టమా? అయితే దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కాస్త ఓపిక తెచ్చుకుని.. మరికాస్త ఇష్టాన్ని పెట్టి.. కొంచెం శ్రద్ధతో చేస్తే ఇంట్లోనే మీరు టేస్టీ, క్రిస్పీ మసాలా దోశను రెడీ చేసుకోవచ్చు. అయ్యో మాకు మసాలా రాదు.. ఈ దోశ రుచిని పెంచే రెడ్ చట్నీ రాదు అనుకుంటున్నారా? అస్సలు బాధపడకండి. మీరు టేస్టీగా మసాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.. రెడ్ చట్నీని అసలు దేనికి ఉపయోగించాలో తెలుసుకోవాలంటే ఈ రెసిపీ చదవాల్సిందే. ఇంతకీ ఈ టేస్టీ మసాలా దోశను ఏ విధంగా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బియ్యం - 2 కప్పులు


పచ్చి శనగపప్పు - 1 కప్పు


మినపప్పు - పావు కప్పు


మెంతులు - 1 టీస్పూన్


ఉప్పు - తగినంత


మసాల దోశ కోసం..


బంగాళ దుంపలు - 5


ఆవాలు - 1 టేబుల్ స్పూన్


పచ్చిశనగ పప్పు - 1 టేబుల్ స్పూన్


కరివేపాకు - 1 రెబ్బ


వెల్లుల్లి - 5 రెబ్బలు


ఉల్లిపాయ - 2


పచ్చిమిర్చి - 2


పసుపు - 1 టీస్పూన్


ఉప్పు - తగినంత 


కొత్తిమీర - పావు కప్పు


రెడ్ చట్నీ కోసం


నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు


కారం - 2 టేబుల్ స్పూన్లు


తయారీ విధానం


ముందుగా మినపప్పు, పచ్చిశనగపప్పు, బియ్యం కలిపి ఓ గిన్నెలో నానబెట్టండి. దానిలో మెంతులు కూడా వేసి ఓ నాలుగైదు గంటలు నాననివ్వాలి. అవి పూర్తిగా నానిన తర్వాత బాగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పిండిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని మరో 6 గంటలు ఫెర్మెంట్ చేయాలి. లేదంటే ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​ కోసం రాత్రి పిండిని సిద్ధం చేసుకుని.. పిండిని బయటే ఉంచాలి. దీనిని ఉదయాన్నే వాడుకోవడం ఈజీగా ఉంటుంది. 


మసాల కోసం..


ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నీరు వేయాలి. దానిలో బంగాళదుంపలు వేసి బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికినతర్వాత స్టౌవ్ ఆపేసి బంగాళ దుంపలను పొట్టు తీసి వాటిని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచండి. దానిలో నూనె లేదా నెయ్యి వేసి పచ్చినశనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలను చిదిమి వేయాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి దానిలో వేసి మగ్గనివ్వాలి.


ఉల్లిపాయలు ఉడికిన తర్వాత దానిలో పసుపు వేయండి. దానిని బాగా మిక్స్ చేసి దానిలో ఉడకబెట్టిన బంగాళదుంపలు వేయాలి. వాటిని స్మాష్ చేసి.. పోపు బాగా కలిసేలా కలపాలి. దానిలో ఉప్పు కూడా వేసి బాగా కలపండి. అవి ఉడికిన తర్వాత దానిలో కొత్తిమీర వేసి దానిని బాగా మిక్స్ చేసి స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు రెడ్ చట్నీకోసం గిన్నెలో నెయ్యి వేసుకుని దానిలో కారం వేసి బాగా కలపండి. దానిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.


స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ పెట్టండి. దానిపై దోశ వేసి.. రోస్ట్ అయ్యేందుకు నెయ్యి వేయాలి. దానిపై రెడ్ చట్నీని వేసి స్ప్రెడ్ చేయాలి. ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని దానిపై వేసి.. దోశను మగ్గనివ్వాలి. దోశ గోల్డెన్ కలర్​లో రోస్ట్ అయిన తర్వాత దోశను మడిచి పక్కన పెట్టుకోవాలి. అంతే వేడి వేడి టేస్టీ మసాలా దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో హాయిగా లాగించేయవచ్చు. 


Also Read : బ్యాటర్ ఒకటే రెసిపీలు రెండు.. ఇన్​స్టాంట్​ ఇడ్లీలు, దోశలు ఇలా చేసేయండి