క్కెర వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. చక్కెర అతిగా తీసుకోవడం వల్ల పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్(PKD) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ స్టడీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 మిలియన్లకి పైగా ప్రజలని ఈ వ్యాధి ప్రభావితం చేస్తోంది. ఇది సోకితే నయం చేయడం కష్టం, కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే మూత్రపిండాల మీద తిత్తులు ఏర్పడతాయి. అవి కిడ్నీ స్వరూపాన్నే మార్చేస్తాయి. ద్రవంతో నిండిన ఈ తిత్తుల ఏర్పాటులో చక్కెర కీలక పాత్ర పోషిస్తుంది. ఈ తిత్తులు మూత్రపిండాల పనితీరుని దెబ్బతీసేంత పెద్దవిగా పెరుగుతాయి. చివరికి అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది. షుగర్ తీసుకోవడం అనేది మూత్రపిండాలు అన్ని సమయాల్లో చేసే పని అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. అయితే తీసుకునే పదార్థాల్లో చక్కెర స్థాయిలని పెంచడం వల్ల తిత్తులు ఉబ్బినట్లు వాళ్ళు కనుగొన్నారు. మూత్రపిండాల్లో చక్కెర శోషణ నిరోధించే మందుల్ని ఉపయోగించినప్పుడు దాని వాపుని అది తగ్గించిందని తెలిపారు.


అసలు మూత్రపిండాల్లోని ద్రవం  PKDకి ఎలా దోహదపడుతుందనే దాని మీద పరిశోధకులు దృష్టి సారించారు. అందులో భాగంగా కిడ్నీ ఆర్గానోయిడ్ ని మైక్రోఫ్లూయిడ్ చిప్ తో కలిపే ఒక కొత్త సాధనాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఇది నీరు, చక్కెర, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాల కలయికని పీకేడీ అనుకరించేలా చేశారు. దీని వల్ల తిత్తులు వాపు రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది జన్యుపరమైన వ్యాధి. కుటుంబంలో ఒకరికి వచ్చిందంటే మిగతా వారికి కూడా వచ్చే అవకాశం ఉంది. పీకేడీ సోకిన వ్యక్తులు కాలేయం వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి లక్షణాలు


⦿ తరచుగా మూత్ర విసర్జన


⦿ పొత్తికడుపు నొప్పి


⦿ మూత్రంలో రక్తం పడటం


⦿ తీవ్రమైన వెన్నునొప్పి  


ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి తగిన వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


చక్కెర తీసుకోవడం వల్ల వచ్చే ఇతర సమస్యలు


అధికంగా చక్కెరతో చేసిన ఆహారం తినడం వల్ల పొట్ట నొప్పిగా ఉంటుంది. అవి త్వరగా జీర్ణం కాక పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దంతాల ఆరోగ్యానికి తీపి పదార్థాలు అసలు మంచివి కావు. వీటిని తినడం వల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అధిక చక్కెర శరీరంలో చేరితే కొవ్వు రూపంలోకి మారుతుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని కూడా ఇది దెబ్బతీస్తుంది. చర్మానికి సంరక్షణ ఇచ్చే కొల్లాజెన్ నాణ్యతని ఇది తగ్గిస్తుంది. దీంతో చర్మం మీద ముడతలు, గీతాలు ఏర్పడతాయి. అందుకే వీలైనంత వరకు చక్కెరని తీసుకోకపోవడమే మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఓ మై గాడ్, కోవిడ్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందా?