కాలేయ క్యాన్సర్ వచ్చిందా వారి మనుగడ రేటు చాలా తక్కువనే అర్థం చేసుకోవాలి. రోగినిర్ధారణ అయ్యాక దాదాపు అయిదేళ్లు బతికేవారి సంఖ్య 13 శాతం కన్నా తక్కువే. కొంతమంది ఈ క్యాన్సర్ సోకిన రెండేళ్లలోపే మరణించిన సందర్భాలు అధికం. మరికొందరిలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా కచ్చితంగా బతుకుతారన్న గ్యారంటీ లేదు. అందుకే లివర్ క్యాన్సర్‌ను ప్రాణాంతక వ్యాధిగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఓ కొత్త అధ్యయనం ఒక దిగ్భ్రాంతి కరమైన విషయాన్ని చెప్పింది. కాఫీ, టీలు అధికంగా తాగేవారిలో లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికమని చెప్పింది. చక్కెర కలుపుకుని కాఫీ, టీ తాగే వారిలో కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం 78 శాతం అధికమని తేల్చింది. 


 పరిశోధన ఇలా...
సౌత్ కరోలినా విశ్వవిధ్యాలయంలోని నిపుణులు తొంభై వేల మంది రుతుక్రమం ఆగిపోయిన మహిళ ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించారు. దాదాపు 18 ఏళ్ల పాటూ వారి ఆహారశైలిని గమనించారు. వారిలో ఏడు శాతం మంది మహిళలు రోజూ చక్కెర అధికంగా వేసుకుని ఒకటి లేదా రెండు సార్లు టీ,కాఫీ లాంటి పానీయాలు తాగుతున్నట్టు గుర్తించారు. ఆ ఏడు శాతం మందిలో 205 మంది మహిళల్లో కాలేయ క్యాన్సర్ లక్షణాలు అభివృద్ధి చెందినట్టు కనిపెట్టారు. 


ఈ లక్షణాలు...
205 మంది మహిళల్లో ఆకలి లేకపోవడం, అనారోగ్యంగా అనిపించడం, తీవ్రంగా అలిసిపోవడం, చర్మం దురద పెట్టడం, పక్కటెముకల కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు వారిలో కనిపించాయి. దీన్ని బట్టి రోజులో ఒకసారి లేదా అంతకంటే తీప్పి పానీయాలు అధికంగా తాగే మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం 78 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే రోజుకో కూల్ డ్రింక్ తాగే వారు 73 శాతం అధికంగా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. 


తీపి పానీయాలు తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే సంభావ్యత పెరుగుతుంది. కాబట్టి ఏ పానీయాలు తాగినా అందులో చక్కెర కలుపుకోకుండా తాగడం మంచిది. టైప్ 2 మధుమేహం, ఊబకాయం బారిన పడడానికి కూడా చక్కెర కారణమవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. చక్కెరతో అనారోగ్యాలే తప్ప కలిగే ప్రయోజనం ఒక్కటీ లేనప్పుడు, దాన్ని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 


Also read: నాటుకోడి కూర ఇలా వండారో, కొంచెం కూడా మిగలదు


Also read: దీపిక పదుకోన్ ఆరోగ్య సమస్య ఇదే, అందుకే ఆసుపత్రికి వెళ్లింది, ఈ సమస్య ఎవరికైనా రావచ్చు