‘రోబో 2.0’ సినిమాలో పక్షిరాజా ఎంతగా భయపెట్టాడో తెలిసిందే. ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ పక్షుల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుందనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. అక్షయ్ కుమార్ ‘పక్షిరాజా’ అవతారమెత్తి.. ప్రజల చేతుల్లోని ఫోన్లను ఎత్తుకెళ్లిపోయే సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అది దర్శకుడు శంకర్ సినిమా కాబట్టి.. భారీ స్థాయిలో ఉంది. అయితే, రియల్ లైఫ్‌లో పక్షిరాజా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. 


ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ చోటుచేసుకుందో తెలియదుగానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో భలే వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు ఇంటి బయట నిలుచుని వీడియో తీస్తుంటే.. ఓ రామ చిలుక తినే ఆహారం అనుకుని ఫోన్‌ ఎత్తుకెళ్లిపోయింది. పాపం ఆ బాలుడు ఆ ఫోన్ కోసం పక్షి వెనకాల పరిగెట్టాడు. కానీ, దాన్ని అందుకోవడం అతడి వల్ల కాలేదు. 


చిలుక ఎగురుతున్నప్పుడు ఫోన్‌లోని కెమేరా ఆన్‌లోనే ఉంది. వీడియో కూడా రికార్డైంది. ఆ వీడియోను చూస్తే డ్రోన్‌తో తీసినట్లే ఉంది. ఫోన్ ఎత్తుకెళ్లిన తర్వాత ఆ చిలుక కాసేపు గాల్లో ఎగిరింది. కొద్ది సేపటి తర్వాత అది ఓ భవనం మీద వాలింది. ఆ తర్వాత మరికొంత దూరం రోడ్డు మీదుగా ఎగిరి.. కారు మీద వాలింది. ఆ తర్వాత ఎవరో దాని దగ్గర ఉన్న ఫోన్‌ను తీసుకున్నారు. 


Fred Schultz అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అంతే.. అప్పటి నుంచి ఆ వీడియో ఆ చిలుకలాగే చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు ‘రోబో 2.0’లో అక్షయ్ కుమార్‌ను తలచుకుంటున్నారు. ఆ పక్షిరాజే.. ఈ చిలుక రూపంలో వచ్చాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్‌ను నుంచి తమని తాము రక్షించుకొనేందుకు పక్షులు ఇలా కక్ష కట్టి ఫోన్లు ఎత్తుకుపోతున్నాయి కాబోలని అంటున్నారు. కొందరైతే ఈ పక్షికి ‘ఇకో ఫ్రెండ్లీ’ పక్షి అని పిలుస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.


వీడియో:


రోబో 2.0తో ఎందుకు పోలిక?: ఈ ఘటనను ‘రోబో 2.0’తో ఎందుకు పోల్చుతున్నారో తెలుసుకోవాలంటే.. ఆ సినిమా కథను తెలుసుకోవల్సిందే. ఇందులో అక్షయ్ కుమార్ పక్షులను అమితంగా ప్రేమించే వ్యక్తి ‘పక్షిరాజా’ పాత్రలో కనిపించాడు. పక్షులు లేకపోతే మానవుడి మనుగడే ఉండదని నమ్మే పక్షిరాజా.. వాటికి ఏ కష్టం వచ్చినా చలించిపోతాడు. ఈ సందర్భంగా పక్షులను స్వయంగా సంరక్షించడం మొదలుపెడతాడు. అయితే అతడి ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీంతో సెల్‌ఫోన్లు వాడొద్దని ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు. రేడియేషన్ స్థాయిలు తగ్గించాలని ప్రభుత్వాలను కోరినా ఫలితం ఉండదు. దీంతో తన ఇంటి వద్ద ఉన్న సెల్ టవర్‌కు ఉరి వేసుకుని చనిపోతాడు. ఈ సందర్భంగా చనిపోయిన పక్షుల ఆత్మలన్నీ అతడి ఆత్మతో కలిసి ‘పక్షిరాజా’ అనే భయానక శక్తిలా తయారవుతాడు. జనాల ఫోన్లను నాశనం చేయడమే కాకుండా సెల్ టవర్లకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, టెలికాం సంస్థ యజమానులను చంపేస్తుంటాడు. అందుకే.. ఈ వైరల్ వీడియోలో చిలుకను అంతా పక్షిరాజా అంటున్నారు. 


Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?


Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?