Pigeon Virus : పక్షుల్లో పావురాన్ని శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మనకు పావురాలు కనిపిస్తాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఇవి మానవ ఆవాసాల్లో జీవించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. అయితే, పావురాలకు చాలామంది గింజలు తినిపిస్తుంటారు. ఈ అలవాటు ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతోంది. ప్రాణాల మీదకు తెస్తోంది.


అతి ప్రమాదకరమైన వైరస్ ఇది


ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక నివేదికలో ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో కొంత మంది పసిపిల్లల మరణాలకు కారణాలు వెతుకుతుండగా, వారి రక్తంలో ఏవియన్ పారామిక్సోవైరస్ - 1 రకం (PPMV-1) వైరస్ కనిపించింది. సాధారణంగా పావురాల్లో ఈ వైరస్ కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ వైరస్ వల్ల  నరాల సంబంధిత వ్యాధి సోకుతుందని పరిశోధకులు వివరించారు. మెటాజెనోమిక్ పరీక్ష ద్వారా మాత్రమే ఈ వ్యాధిని కనుగొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


పిల్లలకు అత్యంత ప్రమాదకరం


ఏవియన్ పారామిక్సోవైరస్ టైప్ 1 (APMV-1) అనేది న్యూకాజిల్ వ్యాధికి కారణమయ్యే సింగిల్-స్ట్రాండ్ RNA వైరస్, ఇది పక్షులలో న్యూరో, జీర్ణ  శ్వాస సంబంధిత వ్యాధికి కారణం అవుతుంది. ఇది మనుషులలో సాధారణంగా తేలికపాటి కండ్లకలక లాంటి లక్షణాలతో ప్రారంభం అవుతుంది. అరుదుగా ఈ వైరస్ ప్రాణాంతకం అవుతుంది. ప్రస్తుతం పరిశోధకులు APMV-1 పావురం వేరియంట్ వల్ల కలిగే న్యూరోలాజికల్ వ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రధానంగా పావురాలు ద్వారా వ్యాపిస్తుంది, ఫలితంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల మరణానికి దారితీస్తుంది.


ఆరు నెలల క్రితం బ్లినాటుమోమాబ్‌ అనే వ్యాధికి చికిత్స పొందుతున్న ప్రీ-బి సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ALL) హిస్టరీ ఉన్న 2 ఏళ్ల పాపకు మూడు వారాల పాటు వికారం, వాంతులు కలిగాయి. గతంలో ఆ పాప అనారోగ్యం, అలసటకు గురైన చరిత్ర లేదు. అయితే తరువాతి నాలుగు రోజుల్లో ఆమె పరిస్థితి విషమించి, జ్వరంతో పాటు ఇన్ఫెక్షన్-సంబంధిత ఎపిలెప్సీ సిండ్రోమ్ (FIRES) ఆమెలో కనిపించింది. పావురాల నుంచి వ్యాపించిన వైరస్ వల్ల ఆమె నాడీ న్యూరాలాజికల్ డిజార్డర్స్ కు గురైనట్లు తెలిసింది.


పావురాల రెట్టలూ యమ డేంజర్


అంతేకాదు పావురాలపై జరిపిన పరిశోధనలో అనేక ఇతర ప్రమాదాలు కూడా బయటపడ్డాయి. పావురాల రెట్టలో ఊపిరితిత్తులకు నష్టాన్ని కలిగించే అనేక ఇన్ఫెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి గురించి మీకు త్వరగా తెలియదని వైద్యులు కూడా అంటున్నారు. మీ ఇంట్లో అమర్చిన ఏసీ చుట్టూ పావురాలు గూడు కట్టుకుని ఉంటే, ఈ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.


పావురాల వల్ల వచ్చే వ్యాధులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. పావురాల వల్ల హైపర్ సెన్సిటివిటీతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా వేగంగా పెరిగింది. 2001 సంవత్సరంలో లండన్ నగరంలో పావురాలకు ఆహారం వేయడంపై నిషేధం విధించారు. ఇది మాత్రమే కాదు, 2008లో వెనిస్ నగరంలోని సెయింట్ మార్క్స్ స్క్వేర్‌లో పక్షులకు ఆహారాన్ని విక్రయించే వారిపై జరిమానా విధించే నిబంధనను రూపొందించింది. అయితే కొన్నేళ్ల క్రితం ఓవిస్టాప్ అనే గర్భనిరోధక మందును కాటలోనియాలో పావురాలకు తినిపిస్తూ పావురాల జనాభాను నియంత్రిస్తున్నారు.


Also Read : షేవింగ్ చేస్తే రోమాలు మందంగా పెరుగుతాయా? మహిళలు, ఇది మీ కోసమే!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.