కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఆరేళ్ల ఇద్దరు పిల్లలు తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. అది కూడా రెండు రోజులపాటు కొనసాగడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో పిల్లలిద్దరూ నోరా వైరస్ అనే అంటువ్యాధి బారిన పడినట్టు గుర్తించారు వైద్యులు. దీంతో మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. పిల్లల నుంచి తల్లిదండ్రులకు కూడా ఈ అంటు వ్యాధి సోకినట్టు తేలింది. ఇది కలుషిత నీటి ద్వారా సోకిందని భావిస్తున్నారు కేరళ ఆరోగ్య శాఖ అధికారులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఈ నోరా వైరస్ వల్ల తీవ్రమైన గ్యాస్ట్రో సమస్య మొదలవుతుంది. అదే వాంతులకు, విరేచనాలకు కారణం అవుతుంది. 


ఏమిటీ వైరస్?
నోరా వైరస్‌ని ఫుడ్ పాయిజనింగ్ లేదా స్టమక్ బగ్ అని పిలుస్తారు. ఈ వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల మధ్య విపరీతమైన వాంతులు, విరోచనాలు, పొట్టనొప్పి మొదలవుతాయి. ఒకరి నుంచి ఒకరికి సోకడానికి ఒకటి నుంచి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు త్వరగా సోకుతున్నట్టు గుర్తించారు. కొందరిలో ఈ వైరస్ ప్రాణాంతకం కావచ్చు. కొందరిలో మాత్రం చికిత్స చేయకపోయినా త్వరగానే కోలుకుంటున్నారు. ఈ వైరస్‌ని మొదట్లో ‘నార్వాక్ వైరస్’ అని పిలిచేవారు. ఇది అమెరికా రాష్ట్రమైన ఒహియోలోని ఒక పట్టణం పేరు. ఆ ఊరిలోనే తొలిసారి 1972లో ఇది వ్యాప్తి చెందింది. 


సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం నోరా వైరస్ కారణంగా ప్రతి ఏడాది అమెరికాలో 21 మిలియన్ల మంది తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో నాలుగు లక్షల 50వేల మంది ఐసీయూలో చికిత్స పొందాల్సి వస్తోంది. ప్రతి ఏడాది సంభవించే ఫుడ్ పాయిజనింగ్ కేసుల్లో నోరా వైరస్ కారణంగా కలిగినవే  సగానికి పైగా ఉంటున్నాయి. 


లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. వికారంగా అనిపిస్తుంది 
2. వాంతులు అవుతాయి 
3. భరించలేని కడుపునొప్పి వస్తుంది.
4. నీళ్ల విరేచనాలు అవుతాయి.
5. నోరు చేదుగా అనిపిస్తుంది.
6. జ్వరం ఉంటుంది.
7. కండరాలు తీవ్రంగా నొప్పి పెడతాయి.
8. నోరు పొడిబారిపోవడం, గొంతు పొడిబారిపోవడం జరుగుతుంది.
9. దీని బారిన పడిన పిల్లలు డీహైడ్రేషన్‌కి గురవుతారు. దీనివల్ల ఏడ్చినా కూడా కళ్ళ వెంట కన్నీళ్లు రావు.  


కారణం ఏమిటి?
ఇది ఒక అంటువ్యాధి కాబట్టి ఇన్ఫెక్షన్ చాలా సులభంగా ఇతరులకు వ్యాపిస్తుంది. కలుషితమైన నీరు, కలుషితమైన పాత ఆహారం తినడం వల్ల నోరా వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉండడం వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ను చంపడం కష్టం ఎందుకంటే అవి అన్ని వేడి, శీతల ఉష్ణోగ్రతలను, క్రిమిసంహారకాలను కూడా తట్టుకునే స్థితిలో ఉంటాయి. కాబట్టి వాటిని చంపడం కన్నా మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే ఉత్తమం.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సబ్బుతో 20 సెకన్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  తినే ముందు పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగాలి. సముద్రపు ఆహారాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించాలి. 


Also read: శీతాకాలంలో ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? వాటి నుంచి తప్పించుకోవడం ఎలా?




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.