కొంతమంది టీచర్స్‌కి చదువు చెప్పడం అంటే చాలా ఇష్టం. తమ దగ్గర చదివే పిల్లలకి కొత్త కొత్త విషయాలు నేర్పించాలని తపన పడుతూ ఉంటారు. మరికొంతమంది స్కూల్ కి వచ్చి కుర్చీలో కూర్చుని గుర్రు పెట్టి నిద్రపోతారు. టైమ్ కి జీతం మాత్రం తీసుకుని వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తారు. కానీ ఈ టీచర్ గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. అందుకే ఆమె అత్యంత చెత్త టీచర్ గా పేరు సంపాదించుకుంది. తన 24 ఏళ్ల కెరీర్ లో 20 ఏళ్ల పాటు స్కూల్ కి వెళ్ళకుండా ఎగ్గొట్టింది. అదేంటి పిల్లలు కదా బడికి వెళ్ళకుండా సాకులు చెప్పేది మరి కొత్తగా ఇదేంటని అనుకుంటున్నారా? కానీ ఇక్కడ టీచర్ మాత్రం పిల్లలు చెప్పినట్టు విచిత్రమైన కారణాలు చెప్పి 20 ఏళ్ల పాటు అసలు స్కూల్ కి వెళ్లలేదు.


ఇటలీలోని వెనీస్ నగరంలో ఉన్న ఒక స్కూల్ లో సింజో పావోలీనా డి లియో అనే 56 ఏళ్ల మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేసేది. ఆమె 24 ఏళ్ల కెరీర్ లో 20 ఏళ్ల పాటు అసలు స్కూల్ కి వెళ్లలేదు. 2017లో నాలుగు నెలల పాటు స్కూల్‌కు వెళ్లకుండా సెలవు పెట్టడంతో ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేశారు. దీంతో ఆమె కోర్టుని ఆశ్రయించింది. లియోకి అనుకూలంగా తీర్పు రావడంతో 2018లో మళ్ళీ ఉపాధ్యాయురాలిగా స్కూల్ కి వెళ్ళింది. కానీ తన పంథా మాత్రం మార్చుకోలేదు. విసిగిపోయిన యాజమాన్యం ఇటాలియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ.. అక్కడి సుప్రీం కోర్టులో ఆమెకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం గత వారం తీర్పుని వెలువరించింది. ఆమెకు అసలు బోధించే లక్షణాలు లేవని, టీచర్ గా పనికి రాదని తేల్చి చెప్పింది. లియోని ఉద్యోగం నుంచి తొలగించమని ఆ పాఠశాల విద్యార్థులు ధర్నాకి దిగడాన్ని కూడా న్యాయస్థానం సమర్ధించింది.


లియో 20 ఏళ్లలో తనకి ఆరోగ్యం బాగోలేదని 67 మెడికల్ సర్టిఫికెట్స్ సమర్పించింది.  వర్క్ ప్లేస్ లో యాక్సిడెంట్ అయ్యిందని రెండు సార్లు లీవ్ పెట్టింది. మరో మూడు సార్లు పీరియడ్స్ అని చెప్పి సెలవు పెట్టేసిందట. తర్వాత తన పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరని లీవ్, తన వికలాంగ బంధువులని చూసుకోవడానికి సెలవు కావాలని ఇలా రకరకాల కారణాలు చెప్పి స్కూల్ కి వెళ్ళకుండా ఉండిపోయింది. ఆమె ఎప్పుడైనా స్కూల్ వచ్చినా కూడా విద్యార్థులకు పాఠాలు బోధించకుండా ఫోన్ చూసుకోవడం చేసేదని స్టూడెంట్స్.. ఉన్నతాధికారులకి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత అక్కడి మీడియా ఆమెని పలు ప్రశ్నలు అడిగింది. ‘‘సారి నేను ఇప్పుడు బీచ్ లో ఉన్నాను. ఏమి చెప్పలేను’’ అని సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసిందట. ఈ ఘటన తర్వాత చట్టంలో లొసుగులను తమ అవసరాలకు వాడుకొనే టీచర్లపై ఫొకస్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఆవిడ వల్ల నిజాయతీగా సెలవులు పెట్టేవారు కూడా ఇప్పుడు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు.


Also Read: వర్షాకాలంలో మొటిమలు రాకుండా ఈ టిప్స్ పాటించండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial