Human-Animal Airal Transmission: చాలా కాలంగా ఎలుకలు, గబ్బిలాలకు సంబంధించి పలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ద్వారా ప్రమాదకరమైన వైరస్ లు, బాక్టీరియాలు వ్యాప్తి చెందుతాయని ఇప్పటికే పలువురు పరిశోధకులు తెలిపారు. అయితే, తాజా పరిశోధనలో పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. పక్షులు, జంతువుల వల్ల మనకు కలిగే హాని కంటే మన వల్ల వాటికి కలిగే ముప్పే ఎక్కువని తేలింది. గబ్బిలాలు, ఎలుక లాంటి జీవులతో పోల్చితే మనిషి ద్వారా రెండు రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడైంది. మానవులతోనే ఇతర జంతువులకు పెద్ద ముప్పు కలుగుతుందని బయటపడింది.

  


మనుషుల నుంచే జంతువులకు వైరస్ వ్యాప్తి ఎక్కువ


తాజాగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు వైరల్ జెనెటిక్స్ మీద పరిశోధన నిర్వహించారు. ఈ వైరస్ జెనెటిక్స్ విశ్లేషణలో మనుషులతో పాటు ఇతర జంతువుల మీద ఉన్న వైరస్ ల మీద అధ్యయనం చేశారు. జంతువుల నుంచి మనకు సోకే వైరస్ ల కంటే దాదాపు రెండు రెట్లు వైరస్ లు మన నుంచి జంతువులకు సోకుతున్నాయని వెల్లడైంది. సుమారు 64 శాతం కేసులలో మనుషుల నుంచే ఇతర జంతువులకు వైరస్ లు వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.   


మనుషుల నుంచి వ్యాప్తి చెందే వైరస్ లతో జంతు జాతికి పెను ప్రమాదం


ఇప్పటికే మనుషుల ద్వారా అడవుల విస్తీర్ణం తగ్గడంతో పాటు విపరీతమైన కాలుష్యం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. మనవ కార్యకలాపాల వల్ల జంతువులు తీవ్ర ఒత్తడికి గురవుతున్నట్లు తెలిపారు. ఇక మానవుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ ల కారణంగా వాటి ఉనికికి మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. జంతువులు, మానవుల మధ్య వైరస్ ల ప్రసారంపై కీలక సర్వే నిర్వహించినట్లు ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ తెలిపారు. రెండు దిశలలో సర్వే చేయడం వల్ల వైరల్ పరిణామాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. మనుషుల నుంచి వ్యాప్తి చెందే వైరస్ ల  ద్వారా ఇప్పటికే పలు జంతువులు అంతరించిపోయానని తెలిపారు.


ఆహార భద్రతకు ముప్పు వాటిల్లేనా?


జంతువులు మానవుల మధ్య వైరస్ ప్రసారాన్ని గుర్తించడం వల్ల వైరల్ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చిన మరో పరిశోధకుడు సెడ్రిక్ టాన్ తెలిపారు. దీని ద్వారా భవిష్యత్ తో ప్రాణాంతక వైరస్ ల వ్యాప్తిని అధ్యయనం చేయడంతో పాటు కొత్త వ్యాధుల విషయంలో జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉందని తెలిపారు. నిజానికి మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకినప్పుడు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు వెల్లడించారు. జంతువులకు ముప్పు కలిగించడంతో పాటు సదరు జంతు జాతి మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. H5N1 బర్డ్ ఫ్లూ లాంటి విపత్తలు వల్ల పెద్ద సంఖ్యలో పక్షులు, పశువులను కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. ఆహార భద్రతపై ప్రభావం చూపడం ద్వారా మానవులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. అంతేకాదు, మానవుల నుంచి జంతువులకు సోకే వైరస్ లు మళ్లీ రూపాంతరం చెంది మనుషులకు సోకే అవకాశం ఉందని వెల్లడించారు. 


Read Also: భూమిని చీల్చుకుని పుడుతోన్న మరో మహా సముద్రం - ఆ దేశంలో భారీ పగుళ్లు, మరో ఖండం ఏర్పడనుందా?