Hidden Pesticides on Grapes : ద్రాక్ష పండ్లు చాలా మంది ఇష్టంగా తింటారు. పసుపు, నలుపు రంగు ద్రాక్షలు దాదాపు అన్ని సీజన్​లలో చూస్తాము. పిల్లలకు కూడా వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇవి చూసేందుకు చాలా తాజాగా కనిపిస్తాయి. కానీ వాటిపై పురుగుమందుల అవశేషాలు, మైనం పొర, ధూళి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నేరుగా తినకూడదు. ఎప్పుడూ శుభ్రం చేసిన ద్రాక్షలు మాత్రమే తినాలి. అయితే వీటిని నార్మల్​గా వాటర్​తో కడిగేస్తే సరిపోతుందా అంటే లేదు. మరి వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో.. లేకుంటే కలిగే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం. 

ద్రాక్ష పండ్లు గుత్తులుగా పెరుగుతాయి. దీనివల్ల వాటి మధ్య పెస్టిసైడ్స్ అవశేషాలు ఉండిపోయే ప్రమాదం ఉంది. అలాగే వాటి తొక్క కూడా చాలా పలుచగా ఉండటం వల్ల రసాయనాలు, మట్టి సులభంగా అతుక్కుపోతాయి. కాబట్టి సాధారణంగా నీటితో కడిగితే అవి పూర్తిగా శుభ్రం కావు. అందుకే తినే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

ద్రాక్ష పండ్లను సరిగ్గా కడగకుంటే వచ్చే నష్టాలివే..

ఇటీవల Environmental Working Group ఓ జాబితా విడుదల చేసింది. ద్రాక్ష పండ్లు ఎక్కువగా పురుగుమందులు వాడే పంటల్లో నాలుగో స్థానంలో ఉన్నాయని తెలిపింది. పంటను పురుగులు, ఫంగస్‌, మొల్డ్ నుంచి రక్షించేందుకు రైతులు పలు రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ద్రాక్ష గుత్తుల్లో చిన్న చిన్న ఖాళీలు ఉండటం.. తొక్క పలుచగా ఉండడం వల్ల ఈ రసాయనాలు సులభంగా అతుక్కుంటాయి. అందుకే పిల్లలకు వాటిని ఇచ్చే ముందు బాగా శుభ్రం చేయడం అవసరం.

ద్రాక్ష పండ్లను ఎలా శుభ్రం చేయాలంటే..

ముందుగా ద్రాక్ష పండ్లను ఒక పెద్ద గిన్నెలో లేదా జల్లెడలో పెట్టి టాప్ వాటర్​ కింద 20 నుంచి 30 సెకన్ల పాటు కడగాలి. చేతులతో మెల్లగా రుద్దితే మట్టి, ధూళి, కొంతమేర రసాయనాలు తొలగిపోతాయి. ఇది పూర్తిగా శుభ్రం చేయకపోయినా తదుపరి శుభ్రపరిచే ప్రక్రియకు ఉపయోగపడుతుంది. తర్వాత బేకింగ్ సోడా కలిపిన నీటిలో ద్రాక్ష పండ్లను వేసి 10–15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత మెల్లగా రుద్ది మళ్లీ శుభ్రమైన నీటితో కడగాలి. వైట్ వెనిగర్​లో కూడా వీటిని 5–10 నిమిషాలు నానబెట్టి శుభ్రం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలు బ్యాక్టీరియా, ఫంగస్‌, సూక్ష్మజీవులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

ద్రాక్ష పండ్లను శుభ్రం చేసిన తర్వాత వాటిని మెల్లగా తుడిచి ఆరబెట్టాలి. కిచెన్ టవల్‌తో తుడవచ్చు. లేదా గాలిలో ఆరనివ్వవచ్చు. పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. తినే ముందు సరైన విధంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పురుగుమందుల అవశేషాలు, బ్యాక్టీరియా తగ్గి సురక్షితంగా తినవచ్చు. లేదంటే ఆరోగ్య సమస్యల బారిన పడి ఇబ్బంది పడాల్సి వస్తుంది.