బిలియనీర్లు అనగానే ఎలన్ మస్క్, అదానీ, జెఫ్ బెజోస్... ఇలా పేర్లు చెబుతారు కానీ, వీరందరి ఆస్తులు కలిపినా కూడా ఓ ఆఫ్రికన్ రాజు సంపదలో కనీసం పావు వంతు కూడా ఉండవేమో. ఇప్పటివరకు ఈ భూమిపై పుట్టిన మనుషుల్లో అత్యంత సంపన్నుడు ఇతడేనట. అంటే మానవ జాతిలోనే అత్యంత ధనవంతుడని చెప్పుకోవచ్చు. అతని పేరు మాన్సా మూసా. ఓ ఆఫ్రికన్ రాజు. ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న మాలి దేశం ఉన్న ప్రాంతంలోనే ఈయన రాజ్యం ‘టింబక్తు‘ ఉండేది. దాదాపు 2000 మైళ్ల పరిధిలో ఈ రాజ్యం పరుచుకుని ఉండేది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆయన దీన్ని పాలించాడు. పుట్టుకతోనే సంపన్నుడు. కానీ తన తెలివి తేటలతో ఆ సంపదను కొన్ని వేల రెట్లు పెంచుకున్నాడు. ఇతను ఆ రాజ్యాన్ని 12వ శతాబ్ధంలో పరిపాలించినట్టు చెబుతారు.


పనివారికి బంగారు వస్త్రాలు
మాన్సా మూసా ఎక్కడికి వెళ్లినా ఆయన వెంట పెద్ద పరివారం వెళ్లేది. రక్షణ కోసం వందల మంది సైనికులు వెళ్లేవారు. ఒంటెలు, వాటిని నడిపేవారు, కళాకారులు, అలాగే వందల మంది పనివారు, దారి మధ్యలో వంటలు చేసేందుకు వంటగాళ్లు, గొర్రెలు, కోళ్లు, కూరగాయలు మోసేవారు... ఇలా వేల మందితో వెళ్లేవాడు. ఆయన చుట్టూ ఉండే పనివారు కూడా బంగారంతో నేసిన వస్త్రాలే ధరించేవారట.ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంపన్న జీవితాన్నే జీవించినట్టు చెప్పుకుంటారు. 


తెలివెక్కువే...
మాన్సా మూసాకు తెలివి తేటలు ఎక్కువే. అతడు పుట్టిన సమయానికి అతడి రాజ్యం సంపన్న రాజ్యం. తన తెలివితేటలతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించాడు. ఆ రాజ్యంలో ఉన్న బంగారు గనులను, ఉప్పు నిక్షేపాలను తవ్వి ఇతర దేశాలకు ఎగుమతి చేసేవాడు. ఏనుగు దంతాల వ్యాపారం విపరీతంగా లాభించి సంపదను కుమ్మరించింది. 


అప్పటి అతని ఆస్తిని ఇప్పుడు లెక్కల్లో చెప్పాలంటే ఎంత లేదన్నా రూ.31 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇంత ఆస్తి ఉన్న వ్యక్తి ఇంతవరకు భూమ్మీద పుట్టలేదు. మాన్సా రాజ్యంలోనే ప్రపంచంలో ఉన్న సగం బంగారం ఉండేదని చెప్పుకుంటారు చరిత్రకారులు. ఆ బంగారమంతా దాదాపు పరాయిదేశాలకు తరలిపోయినట్టు చెబుతారు. బ్రిటన్ దేశానికి ఎక్కువ మొత్తంలో బంగారం చేరినట్టు చెబుతారు. ఒకప్పుడు బంగారంతో, సంపదతో తులతూగి పోయిన ఆ ప్రాంతం తరువాత కాలంలో మాలి దేశంగా మారింది. కానీ మాలి ఇప్పుడు పేద ఆఫ్రికా దేశంగా మారిపోయింది. దానికి కారణం మాన్సా మూసానే అని చెప్పుకోవచ్చు. ఎంత తెలివిగా డబ్బు సంపాదించాడో అంతే వెర్రితనంగా కోల్పోయాడు కూడా. దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రయత్నించాడు. కొంత బంగారాన్ని చెలామణీ నుంచి తొలగించాడు. విపరీతంగా ఖర్చులు చేసి చివరికి బంగారు నాణాలు కూడా చేతిలో మిగలకుండా అయిపోయాడు. 


మక్కా ప్రయాణం ఓ చరిత్రే...
అతడు తన రాజ్యం టింబక్తు నుంచి మక్కా వరకు చేసిన తీర్ధయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటికీ ఎంతో పుస్తకాలలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. 1324లో తన రాజ్యానికి  2,700 మైళ్ల దూరంలో ఉన్న మక్కాకు ప్రయాణం అయ్యాడు. రాజ్య భారాన్ని కొడుక్కి అప్పగించాడు. మక్కాకు ఊరేగింపుగా ప్రయాణమయ్యాడు. తనతో పాటూ 60,000 మంది మగ పనివారు, 12,000 బానిసలు వెళ్లారు. వీరంతా తమతో పాటూ కిలోన్నర బంగారు కడ్డీలు తీసుకెళ్లారు. బంగారు పూల దండలు, గుర్రాలు, ఒంటెలు కూడా వెంట తీసుకెళ్లారు.పరివారం మొత్తానికి ఆహారాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించారు. అందుకే మాన్సా మూసా ఇప్పటికీ చరిత్ర మర్చిపోని సంపన్నుడు. 



Also read: మాస్ హిస్టీరియాతో తలలు బాదుకున్న విద్యార్థులు, అసలేంటి ఈ హిస్టీరియా? ఎందుకు వస్తుంది?


Also read: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు