కార్తీక మాసం ముగిసిపోతోంది. ఇక మళ్లీ మాంసాహారం అమ్మకాలు పెరుగుతాయి. ఎప్పుడూ ఒకేలా బిర్యానీ చేసుకుని తింటే బోరు కొడుతుంది కదా, ఈసారి పచ్చిమిర్చి కోడి పులావ్ వండి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. బిర్యానీ కన్నా పులావ్ చేయడమే చాలా సులువు. ఒకే గిన్నెలో సింపుల్‌గా వండేయచ్చు. ప్రయత్నించి చూడండి.


కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు  - అరకిలో
బాస్మతి బియ్యం - అరకిలో
పచ్చిమిర్చి - అయిదు
ఉల్లిపాయ - ఒకటి
పుదీనా - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
పసుపు - పావు టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
పెరుగు - ఒక కప్పు
గరం మసాలా పొడి - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
నూనె - తగినంట
మసాలా దినుసులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ ఇలా
1. చికెన్ ముక్కలు బాగా కడిగి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
3. స్టవ్ మీద బిర్యానీ వండే గిన్నె పెట్టాలి. నూనె వేయాలి. 
4. నూనె వేడెక్కాక నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి. 
5. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి వేయించాలి. 
6. అవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపాలి. 
7. అన్నీ వేగాక చికెన్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.  
8. కప్పు పెరుగు వేసి కలపాలి. అరగ్లాసు నూనె వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. 
9.  చికెన్ ముక్క ఉడికిన తరువాత బాస్మతి బియ్యాన్ని కలిపి, ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. 
10.  అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వంటి మసాలా దినుసులు వేసి కలపాలి. 
11. మూత పెట్టి ఉడికించాలి. 80 శాతం ఉడికాక నెయ్యి వేసి కలపాలి. 
12. అన్నం ఉడికాక స్టవ్ కట్టేయాలి. అంతే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయినట్టే. 


చికెన్ తినాల్సిందే...
ప్రొటీన్లు నిండుగా ఉన్న ఆహారం చికెన్. వారంలో మూడు నాలుగు సార్లు చికెన్ తింటే శరీరానికి సత్తువ వస్తుంది. పిల్లలకు కూడా రెండు రోజులకోసారైనా చికెన్ తినిపించాల్సిన అవసరం ఉంది. రక్తహీనత సమస్య ఉన్న వారు కూడా చికెన్ తినవచ్చు. విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె దీన్నుంచి నిండుగా అందుతాయి. చక్కటి చర్మం, జుట్టు, గోళ్లు కూడా చక్కగా పెరుగుతాయి. మానసిక ఆరోగ్యానికి కోడి మాంసం ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి రాకుండా చికెన్లోని గుణాలు అడ్డుకుంటాయి. మటన్ కన్నా కూడా చికెన్లోనే అధిక పోషకాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చేపలు, చికెన్ వంటివి ఆరోగ్యానికి అత్యవసరమైనవి.


Also read: చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకు? - ఎలా కాపాడుకోవాలి?