చదివింది బాగా గుర్తుంటేనే పరీక్షల్లో రాయగలరు. పిల్లలు చదివింది సరిగా గుర్తు రాక, పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇందుకోసం వారికి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను ఇవ్వాలి. కొన్ని రకాల ఆహారాలు రోజూ తినిపించడం వల్ల అవి జ్ఞాపకశక్తిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెబుతున్నారు అధ్యయనకర్తలు. కొన్ని ప్రత్యేక ఆహారాలను ప్రతిరోజూ తినిపించడం వల్ల వారికి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. ఎరుపు ద్రాక్ష పండ్లు, నీలం, ఊదా రంగు బెర్రీ పండ్లు జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటినుంచి తీసిన జ్యూస్‌ను పిల్లలకు రోజూ తాగిస్తే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. అలాగే అల్జీమర్స్ బారిన పడుతున్న వృద్ధులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఒక అధ్యయనంలో 12 వారాల పాటు వృద్ధులకు రోజుకు ఒక గ్లాసు ద్రాక్ష లేదా బెర్రీ పండ్ల జ్యూస్‌ను అందించారు. ఇలా 12 వారాల పాటు వారికి ఈ రసాలను తాగించారు. వారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్టు గుర్తించారు పరిశోధనకర్తలు.


పిల్లలు కూడా ఈ పండ్లు మేలే చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం తాజా బ్లూబెర్రీలను వారి చేత తినిపిస్తే వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎక్కువ విషయాలను గుర్తు పెట్టుకుంటారు. దాని వల్ల చదువు బాగా వస్తుంది. ద్రాక్ష, బెర్రీలలో జ్ఞాపకశక్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఆంథియోసైనైన్స్ అనే పాలిఫనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వాటి వల్లే ఈ పండ్లకు ఆ ముదురు రంగు వస్తుంది.  ఇవి మెదడుకు పోషకాలను, ఆక్సిజన్‌ను పుష్కలంగా అందిస్తాయి, దీనివల్ల మొదలు చురుగ్గా పనిచేస్తుంది. నరాలు ఉత్తేజితమవుతాయి. 


ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్‌ను ఎప్పుడు స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇది ఆ రోజంతా జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరగడానికి కూడా సహాయపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అల్పాహారం కచ్చితంగా తినేవారు చదువుల్లో బాగా రాణిస్తున్నట్టు కూడా ఒక అధ్యయనం వివరించింది. కొవ్వుతో కూడిన చేపలు తినడం కూడా చాలా ముఖ్యం. ఆ కొవ్వులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తినడం వల్ల అల్జీమర్స్, పక్షవాతం వంటివి వచ్చే అవకాశం తక్కువ. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందించి ఏకాగ్రతను ఇస్తాయి. వారంలో కనీస రెండు నుంచి మూడుసార్లు చేపలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. 


బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి కూడా పిల్లలకి రోజూ తినిపిస్తూ ఉండాలి. వీటిలో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వాటితో పాటు సెలీనియం, మాంగనీస్, రాగి వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా నాడులు సవ్యంగా పనిచేయడానికి అత్యవసరం. మానసిక స్థితిని కూడా ఇవి మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి.


ఈ పండ్ల రసాలతో పాటూ ఇతర ఆహారాలను పిల్లలకు తినిపించాలి. బ్రౌన్ రైస్ కేవలం పెద్దలకే కాదు పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా సాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి బ్రౌన్ రైస్‌ను పిల్లలకి కూడా తినిపిస్తూ ఉండాలి. రోజుకో గుడ్డును తినిపించడం మర్చిపోవద్దు. దీనిలో కొలిన్ అనే పోషకం ఉంటుంది. అది విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంచుతుంది. మెదడులో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. సెరటోనిన్ వల్ల మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. 


Also read: ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు పరార్, వీటిని పెంచుకోవడం చాలా సులువు



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.