డయాబెటిస్ ఎందుకు వస్తుంది? అనేది వివరించలేం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ వచ్చాక మాత్రం వదిలి వెళ్లదు. దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి తప్ప, పూర్తిగా శరీరం నుంచి బయటికి పంపేయలేం. కేవలం ఆహారం, వ్యాయామాలు, మంచి ఆరోగ్యపు అలవాట్లతోనే డయాబెటిస్ లొంగి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రెచ్చిపోయి శరీరంలోని ప్రధాన అవయవాలను పాడు చేస్తుంది. మొదట ప్రభావం పడేది కిడ్నీలపైనే. కాబట్టి డయాబెటిస్ ను ఎలా నియంత్రణంలో ఉంచుకోవాలో తెలుసుకుందాం. ఎలాగూ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఉంటారు. అలాగే ఇంట్లో కూడా కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. 


యాపిల్ సిడర్ వెనిగర్
ఇది మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో కొన్ని ఔషధగుణాలు కూడా ఉంటాయి. గోరువెచ్చటి  నీటిలో రెండు స్పూనుల యాపిల్ సిడర్ వెనిగర్ కలుపుకుని మధుమేహులు తాగితే చాలా మంచిది. అది కూడా పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల ఫాస్టింగ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహుల్లో తినకముందు షుగర్ స్థాయిలు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. లేదా ఆహారంలో భాగంగా రెండు స్పూనుల ఈ పానీయాన్ని తీసుకున్నా కూడా రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది. 
 
బార్లీ
బార్లీ గింజల్లో ఉండే పోషకాలు ఇన్నీ అన్నీ కావు. రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువును తగ్గించడంలో ఇవి ముందుంటాయి. పిల్లలకు బార్లీ నీళ్లు పట్టడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే డయాబెటిక్ రోగులకు కూడా బార్లీ నీళ్లు ఇవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీళ్లలో కాస్త ఉప్పు కలిపి తాగితే డయాబెటిస్ అదుపులోనే ఉంటుంది. ఏదో ఒకసారి తాగితే కాదు, ప్రతి రోజు కనీసం ఒక గ్లాసు తాగడం అలవాటు చేసుకోవాలి. 


మెంతులు
డయాబెటిక్ పేషెంట్లకు మెంతులు చేసే మేలు ఇంతా అంతా కాదు. గ్లూకోజు స్థాయిలు తగ్గేలా చూడటానికి మెంతులు చాలా ఉపయోగపడతాయని భారతీయ వైద్య పరిశోధన మండలి  ఇంతకు ముందే చెప్పింది. దీనిలో సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ నీటిలో సులువుగా కరిగిపోతుంది.అందుకే ఇది ఆహారంలోని పిండి పదార్థాలు గ్రహంచుకోవడాన్ని నెమ్మది చేస్తుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజు అమాంతం ఒకేసారి కలవదు. నెమ్మదిగా కలుస్తుంది. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంటే మొత్తంగా డయాబెటిస్ అదుపులో ఉంది. ముందు రోజు రాత్రి మెంతులను గ్లాసు నీళ్లలో నానబెట్టి, ఉదయాన లేచాక వడకట్టుకుని ఆ నీళ్లను తాగేయాలి. లేదా మెంతులను కచ్చపచ్చాగా పొడి చేసుకుని ముందు రోజు రాత్రి నీళ్లలో నాన బెట్టుకోవాలి. మరుసటి రోజు మెంతి పొడితో సహా తాగేయాలి. ఇలా తాగితే రెండు వారాల్లో ఫలితం కనిపిస్తుంది. రోజూ ఇలా తాగితే మధుమేహం అదుపులో ఉండడమే కాదు, దాని కారణంగా వచ్చే ఏ సమస్యా శరీరంపై ప్రభావం చూపదు. 


Also read: ఈ రెండు ప్రాంతాల్లో వచ్చే నొప్పి కరోనా సోకిందని చెప్పే ముందస్తు సంకేతం కావచ్చు, తేలికగా తీసుకోవద్దు


Also read: కాకరకాయ పల్లికారం వేపుడు, ఏ మాత్రం చేదు తగలని రెసిపీ, మధుమేహులకు ప్రత్యేకం