ఆహారప్రియులకు కరోనా jకష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇష్టమైన రెస్టరెంట్లకు వెళ్లలేక చాలా నెలల పాటూ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ, జనం మధ్యలో వెళ్లి కూర్చోవాలంటే ఇప్పటికీ  బెదురుగానే ఉంది. అందుకే కొన్ని రెస్టారెంట్లు ఆహారప్రియుల కోసం కొత్త ట్రెండ్ మొదలుపెట్టాయి. అదే ‘డ్రైవ్ ఇన్ రెస్టరెంట్’. 




ఈ ట్రెండ్ 1970వ దశకంలో దేశంలోని చాలా చోట్ల ఉండేది. తరువాత క్రమేపీ కనుమరుగయ్యింది. మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్ దేశవ్యాప్తంగా మొదలవుతోంది. కాన్పూర్, చెన్నై, ఢిల్లీ, ముంబైలలోని కొన్ని రెస్టరెంట్లు ఈ డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ను నిర్వహిస్తున్నాయి. లాక్ డౌన్ అనంతరం రెస్టరెంట్లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక కూడా చాలా చోట్ల హోటళ్లు నష్టాల బాట పట్టాయి. కరోనా భయంతో రెస్టరెంట్లు లోపలికి వచ్చి కూర్చునేందుకు చాలా మంది సంకోచించారు. దీంతో ఇలా డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు కాన్పూర్ డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ యజమాని మల్హోత్రా. ‘డ్రైవ్ అండ్ డైన్’ పేరుతో తాము ఓపెన్ పార్కింగ్ రెస్టారెంట్ మొదలుపెట్టామని, వినియోగదారులు భారీగా వస్తున్నారని చెప్పారాయన. తమ రెస్టరెంట్ ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనే కారులు పార్క్ చేసేందుకు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 


ప్రారంభించిన తొలివారంలోనే దాదాపు 60 కార్లు డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ను వచ్చాయని తెలిపారు మల్హోత్రా. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ప్రతి వారం రకరకాల థీమ్ లతో అలంకరిస్తూ వినియోగదారులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నట్టు తెలిపారు. కొంతమంది దాదాపు మూడు కార్లు పట్టే ప్రదేశాన్ని ముందే బుక్ చేసుకుని,  ఆ ప్రదేశంలో తమ కుటుంబాలతో కూర్చుని రకరకాల ఆటలు ఆడుతున్నారని చెప్పారు. 


డ్రైవ్ ఇన్ పార్టీస్ కూడా....


చెన్నైలో అర్జున్ గార్డెన్ కేఫ్ నడిపిస్తున్నారు శ్యామ్ సుందర్. ఈయన తన కేఫ్ ముందు డ్రైవ్ ఇన్ బర్త్ డే పార్టీలు కూడా నిర్వహిస్తున్నారు.  అంటే పార్క్ చేసిన కార్లలోనే బర్డ్ డేకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఫ్లాష్ మాబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారాయన. దాదాపు ఎకరాల స్థలంలో ఆయన ఈ కేఫ్ ను నడిపిస్తున్నారు. డ్రైవ్ ఇన్ రెస్టరెంట్ ట్రెండ్ కోసం ఆయన 30,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. అక్కడ 45 నుంచి 50 కార్లు పడతాయి. అంతేకాదు వినియోగదారులను ఆకర్షించేందుకు క్రికెట్, ఫుట్ బాల్ మ్యాచులను కూడా పెద్ద స్క్రీనులపై ప్రదర్శిస్తున్నారు. కారుల్లో కూర్చుని తింటూనే, మ్యాచులను తిలకించవచ్చు. 


చెన్నైలోని మరో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ‘శ్రీ కమచి మెస్’. కరోనాకు ముందు ఇదొక సాధారణ మెస్. లాక్డౌన్ తరువాత దీన్ని డ్రైవ్ ఇన్ మెస్ కింద మార్చారు. కార్లలోనే కూర్చుని కంఫర్ట్ గా తినేలా చెక్కతో చేసిన చిన్న బెంచీలు కూడా ఏర్పాటు చేశారు.  దాదాపు ఈ మెస్ ముందు ఒకేసారి 40 కార్లు పార్క్ చేసే వీలుంది. 


కరోనా తరువాత హోటల్ బిజినెస్ భారీగా దెబ్బతింది. ఆ బిజినెస్ పై ఆధారపడి లక్షల మంది జీవిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లు నడుస్తున్నప్పటికీ ఆశించినంత లాభాలు లేకపోవడంతో హోటలియర్లు ఇలాంటి కొత్త ట్రెండ్లను సెట్ చేస్తున్నారు.