మీరు ‘సర్దార్’ సినిమా చూశారా? చూసి ఉంటే ఇప్పటికే మీరు ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం మానేసి ఉంటారు. లేదా తప్పని పరిస్థితుల్లో దేవుడి మీదే భారం వేసి తాగేస్తుంటారు. వాస్తవానికి, ప్లాస్టిక్‌లో నీళ్లు నిల్వ ఉంచడమంటే.. వ్యర్థాల్లో నీటిని నోటిలో వేసుకున్నట్లే. ఔనండి, ప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది. అందుకే, ప్లాస్టిక్ బ్యాగ్గులు, వస్తువులను నిషేదించాలనే డిమాండ్ పెరిగింది. మరి, అలాంటిది మనం ఏకంగా ఆ ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీటిని నిల్వ ఉంచుకుని మరి తాగేస్తున్నాం. వాటిని స్వచ్ఛమైన నీటిగా భావిస్తున్నాం. కానీ, అవే ప్రాణాలు తీసే విషం అనే సంగతి మీకు తెలుసా? అయితే, తెలుసుకోండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. నదులు, చెరువులు, సరస్సులు కాలుష్యమయమైన నేపథ్యంలో.. మనం నీటిని కొనుగోలు చేసుకొనే పరిస్థితి వచ్చింది. కానీ, మీరు కొనుగోలు చేస్తున్న ఆ నీరు ఎంత ప్రమాదకరమైనది తప్పకుండా తెలుసుకోవల్సిందే. 


ఒకప్పుడు బయటికి వెళ్తే, ప్రయాణాల్లో ఒక గాజు సీసాలో నీళ్లు నింపుకుని తీసుకుని వెళ్లేవారు. ఎవరైనా అడిగితే సందేహం లేకుండా ఆ నీటిని పంచుకొనేవారు. ఎందుకంటే.. నీళ్లు అప్పట్లో మార్కెట్లో అమ్ముడయ్యే వస్తువు కాదు. ప్రకృతి ప్రసాదించిన వరం. అయితే, ఇప్పుడు ఎవరూ నీళ్ల బాటిళ్లను తమ వెంట తీసుకెళ్లడం లేదు. అవసరమైతే నీటి బాటిళ్లు బయట మార్కెట్లోనే దొరికేస్తున్నాయి. ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో ఎప్పటి నుంచో నిలువ ఉంటున్న నీళ్లను మినరల్ వాటర్ అనుకొని తాగేస్తున్నాం. ఆ నీరు తాగేప్పుడు మనసైతే కుదుట పడుతుంది. కానీ, ఆరోగ్యానికి ఆ విషయం తెలియదు కాబట్టి.. ఎప్పుడైనా మిమ్మల్ని మంచాన్న పడేయొచ్చు. బయట దొరుకుతున్న వాటర్ బాటిళ్లే కాదు. మీ ఇంటికి టిన్‌లలో వస్తున్న నీరు కూడా సురక్షితం అనుకుంటున్నారా? కానే.. కాదు. 


ఒక వ్యక్తి జీవిత కాలంలో దాదాపు 44 పౌండ్ల ప్లాస్టిక్ తినేస్తున్నాడని థామస్ రూటర్స్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడించింది. ఇప్పుడు ప్రజలు క్రమేనా పర్యావరణం గురించి నెమ్మదిగా ఆలోచిస్తున్నారు. వనరులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారు. అయితే, ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగం పరిమితికి మించి ఉంది. నిజానికి మన కిచెన్స్ ప్లాస్టిక్ బాటిల్స్, జార్స్, కంటైనర్స్, గిన్నెల నుంచి గార్బేజ్ బ్యాగుల వరకు ఎన్నో వస్తువుల రూపంలో ప్లాస్టిక్ నిండి ఉంది.


ఒక సర్వే ప్రకారం ప్రతి రోజు ఇండియాలో 6వేల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోందట. దాదాపు 10 వేల టన్నుల ప్లాస్టిక్ తిరిగి సేకరించబడడం లేదట. పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడితే ప్లాస్టిక్ వల్ల మన ఆరోగ్యానికి గణనీయమైన నష్టమే జరుగుతోందట. ప్లాస్టిక్ బాటిల్ తో నీళ్లు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన నష్టాలేమిటో ఇక్కడ చూద్దాం.



  • డైయాక్సిన్ ప్రొడక్షన్: నీటితో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ నేరుగా ఎండ తగిలి వేడెక్కినపుడు అందులో డయాక్సిన్ అనే టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ నీళ్లు తాగుతూ పోతే కొంత కాలానికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

  • బీపీఏ జెనరేషన్: బైఫినైల్  అనేది ఒక ఈస్ట్రోజన్ వంటి కెమికల్. ఇది డయాబెటిస్, ఒబెసిటి, ఫెర్టిలిటి  వంటి అనేక అనారోగ్యాలకు కారణం అవుతుంది. అంతేకాదు, బిహేవరల్ వంటి మానసిక సమస్యలు కూడా రావచ్చు. అమ్మాయిల్లో ఎర్లీ ప్యూబర్టీకి ఈ రసాయనం కారణమవుతుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు నిల్వ ఉంచడం, తాగడం ఎప్పటికీ మంచిది కాదు.

  • రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగినపుడు కచ్చితంగా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే కెమికల్స్ వల్ల రోగ నిరోధక వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది.

  • లివర్ క్యాన్సర్: ప్లాస్టిక్ బాటిళ్లలో  ఉండే థాలెట్స్ అనే కెమికల్స్ వల్ల లివర్ క్యాన్సర్ మాత్రమే కాదు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిస్తుంది.

  • స్టేట్ యూనివర్సిటి ఆఫ్ న్యూయార్క్ నిర్వహించిన ఒక అధ్యయనంలో బాటిల్డ్ వాటర్ లో మైక్రోప్లాస్టిక్స్ పరిమితికి మించి కనిపించాయట. ముఖ్యంగా పాపులర్ బ్రాండ్ నీళ్లలో ఇవి ఎక్కువగా ఉన్నట్లు తెలిపాయి. 93 శాతం బాటిల్డ్ వాటర్ లో మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయని అధ్యయనకారులు పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల జరిగే హాని గురించి ఎలాంటి నిర్థారణ చెయ్యలేదు. కానీ ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.