కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడ్డారు. అయితే, ఇంతకాలం స్థూలకాయం ఉన్న వారిలో  కరోనా తీవ్రత అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తూ వచ్చారు. పలు పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌ అధికంగా ఉంటుందని తెలిపాయి. అంతేకాదు.. స్థూలకాయంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా ఎక్కువకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందని వివరించాయి. వారిలోని వైరస్ పూర్తిగా నశించేందుకు చాలా సమయం పడుతుందని తెలిపాయి. పురుషులతో పోల్చితే స్థూలకాయం ఉన్న మహిళల్లో ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ లక్షణాలు, కారణాలపై అధ్యయనం జరిగిన తర్వాత శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న స్త్రీలకు కోవిడ్ సోకే ప్రమాదం ఎక్కువని తేలింది. అయితే  స్థూలకాయం ఉన్నవారిలో పోస్టు కోవిడ్ లక్షణాలు అస్పష్టంగానే ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.


MRC యూనిట్ ఫర్ లైఫ్‌ లాంగ్ హెల్త్ అండ్ ఏజింగ్, యూనివర్శిటీ కాలేజ్ లండన్ కు చెందిన డాక్టర్ అనికా నప్పెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. "మొదట పాండమిక్ పరిశోధనలో మధుమేహం, ఊబకాయం ఉన్న వారు  COVID-19తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించాం. టైప్ 2 మధుమేహంతో జీవిస్తున్న చాలా మంది స్థూలకాయాన్ని కలిగి ఉన్నారు. అయితే, స్థూలకాయంతో పోల్చితే మధుమేహం కలిగిన వారు COVID-19తో ఎక్కువ ప్రమాదానికి గురికావచ్చు" అని డాక్టర్ నప్పెల్ చెప్పారు.


గత పరిశోధనల్లో మధుమేహం, ఊబకాయం ఉన్నవారికి COVID-19 సోకితే తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయే అవకాశం ఉందని భావించారు. అయితే, వారిలో సుదీర్ఘమైన పోస్ట్-COVID-19 లక్షణాల పాత్ర అస్పష్టంగానే ఉందని తాజాగా తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం కొనసాగింది. సగటు రక్తంలో చక్కెర స్థాయి, మందుల ఆధారిత మధుమేహం, బాడీ మాస్ ఇండెక్స్ (BMI) సహా 9 అంశాలను పరిశీలించారు. ఈ పరిశోధనలో భాగంగా 30 వేలకుపైగా వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మే 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఈ వివరాల సేకరణ కొనసాగింది. వీరిలో 5,806 మంది ఎప్పుడైనా COVID-19ని కలిగి ఉన్నట్లు తెలిపారు. 584 మంది దీర్ఘకాలంగా కోవిడ్‌ని కలిగి ఉన్నారని నివేదించారు.   


తొమ్మిది అధ్యయనాలలో పాల్గొన్న 31,252 మంది నుంచి డేటా యొక్క విశ్లేషణలో హై BMI కోవిడ్-19 ఇన్ఫెక్షన్  ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు, ఆరోగ్యకరమైన బరువు కలిగిన వ్యక్తుల కంటే 10% నుంచి 16% ఎక్కువ ముప్పు తీవ్రతను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ, పోస్ట్ కోవిడ్ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉన్నట్లు కచ్చితంగా చెప్పలేమన్నారు. అయితే, అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిపై మరింత పరిశోధన కొనసాగిస్తున్నట్లు నప్పెల్ వెల్లడించారు. ఈ అధ్యయనం హై BMI కలిగి ఉన్న వారిలో  COVID-19 సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుందని నిరూపించలేకపోయిందని పరిశోధకులు తెలిపారు.