పెళ్లి కాకుండా పిల్లలను కనడాన్ని చాలా పెద్ద నేరంగా చూస్తారు. దాదాపు అన్ని దేశాల్లో ఇది అమోదయోగ్యం కాదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రం సహజీవనం చేస్తూనే పిల్లలను కనేందుకు అనుమతి ఉంటుంది. కానీ, కొన్ని దేశాలు మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. ఎందుకంటే.. పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనే జంట వారిపట్ల బాధ్యతాయుతంగా ఉండరని, వారి మధ్య సంబంధాలు తెగినట్లయితే ఆ పిల్లలు అనాథలవుతారని.. లేదా, ఆ ఇద్దరిలో ఒకరికి పిల్లలు భారం కావచ్చనే ఆందోళన కూడా ఉంది. అందుకే, చైనాలో పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనకూడదనే చట్టం ఉంది. ఒక వేళ పెళ్లి కాకుండా పిల్లలను కన్నట్లయితే.. వారి పేర్లపై ప్రభుత్వం బర్త్ సర్టిఫికెట్లను కూడా జారీ చేయదు. పిల్లలను కన్న తర్వాత ఆ జంట పెళ్లి చేసుకుంటేనే అర్హులవుతారు. ఈ నేపథ్యంలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికాకుండా పిల్లలను కనేవారిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఇకపై పెళ్లికాని జంటలు తమ పిల్లల వివరాలను ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది.


చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోవడం వల్ల అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పిల్లల పుట్టుకను నమోదు చేసుకోవడానికి జంటలు వివాహం చేసుకోవాలనే చట్టాన్ని తొలగించినట్లు ఓ స్థానిక మీడియా ప్రకటించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని హెల్త్ కమిషన్ ఫిబ్రవరి 15 నుంచి పిల్లల జనన నమోదు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్లు వెల్లడించింది. పెళ్లి కాకుండా పిల్లలకు జన్మనిచ్చిన జంటలు ఇకపై వారి జననాలను నమోదు చేయాలని పేర్కొంది. 


చైనా చరిత్రలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో చైనాలో జనాభా పడిపోయింది. 2022లో చైనాలో 9.56 మిలియన్ల మంది జన్మించారని, మరణాల సంఖ్య 10.41 మిలియన్ల కంటే ఎక్కువగా ఉందని ఆ దేశ ప్రభుత్వం జనవరి 17న వెల్లడించింది. గత ఆరేళ్ల నుంచి చైనాలో జనన శాతం తగ్గపోతునట్లు వెల్లడించింది. ఈ రిపోర్టులు వచ్చిన వారం వ్యవధిలోనే సిచువాన్ ప్రావిన్స్‌ పాలకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఈ నష్టాన్ని ముందే అంచనా వేసి చైనా.. ఒక జంట కేవలం ఒక బిడ్డను మాత్రమే కనాలనే రూల్‌ను కూడా ఎత్తేసింది. 2021 నుంచి ప్రతి జంట కనీసం ఇద్దరు పిల్లలను కనాలనే పాలసీని ప్రకటించింది. అయితే, చైనా ప్రజలు మాత్రం ఒక బిడ్డతో సరిపెట్టుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమని.. ఒక్కరే ముద్దని చెబుతున్నారు. 
 
అయితే, సిచువాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. స్థానిక పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించేలా ఉందని, పెళ్లి అవసరం లేకుండా పిల్లలను కనమని చెప్పేలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి బదులుగా సింగిల్ ఫాదర్ లేదా సింగిల్ మదర్స్‌కు సాయం చేసే పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిబంధన సిచువాన్ ప్రాంతానికే పరిమితం. చైనాలోని మిగతా ప్రాంతాల్లో పాత విధానాలే అమల్లో ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకోవాలంటే తప్పకుండా మ్యారేజ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సిందే. పెళ్లికాకుండా గర్భం దాల్చే మహిళలకు ఆ సదుపాయం కల్పించడం లేదు.  


Also read: గీజర్‌లో ఉండే గ్యాస్ లీక్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ జాగ్రత్తలు తీసుకోండి