గత రెండేళ్లుగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరోగ్యం బాగోలేదంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆయనకొచ్చిన సమస్యేంటో మాత్రం బయటికి రాలేదు. 2021లో ఆయన్ను ఆసుపత్రిలో కూడా చేర్చారు. కొన్నాళ్ల పాటూ విదేశీ నేతలను ఆయన కలవలేదు కూడా. అసలేంటో ఆయన ఆరోగ్యసమస్య అని చైనాలోనే కాదు ఇతర దేశాల్లోనూ చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఆయన అనారోగ్యం ఇదేనంటూ చైనా మీడియాలో కొన్ని నివేదికలు వచ్చాయి. 


ఇదే సమస్య...
సెరెబ్రల్ అనూరిజం... ఇదే జిన్ పింగ్ ను కుంగీస్తున్న ఆరోగ్యసమస్య. ఇది ప్రాణాంతకమైనది. సెరెబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ అనూరిజం అంటారు దీన్ని. మెదడులోని రక్తనాళంలో బెలూన్ లా ఉబ్బుతుంది. రక్తనాళాల గోడలోపలి పొర బలహీన పడి ఇలా వ్యాకోచిస్తుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చి పడే ప్రమాదం ఇది. బెలూన్ లా ఉబ్బిన ఈ పొర ఎప్పుడైనా చీలి పోవచ్చు. ఫలితంగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. దీన్ని సబ్ అరాక్నోయిడ్ హెంరేజ్ అంటారు. ఇలా రక్తస్రావం జరిగితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కోమాలోకి వెళ్లడం లేదా మరణించడం జరగవచ్చు. 


ఎలా తెలిసింది...
2019 మార్చిలో జిన్ పింగ్ ఇటలీ పర్యటనలో నడిచేందుకు ఇబ్బంది పడ్డారు. అలాగే తరువాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి పక్కవారి సాయం తీసుకున్నారు. అలాగే  2020 అక్టోబర్ ప్రజలనుద్దేశించి మాట్లాడినప్పుడు కూడా మాటల్లో జంకు, నెమ్మది, దగ్గు కనిపించాయి. ఇవన్నీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పాయి. దీంతో చాలా ఊహాగానాలకు దారి తీసింది. 


సెరెబ్రల్ అనూరిజం ముందస్తు లక్షణాలు...
ఈ సమస్య మొదలవ్వగానే కొన్ని లక్షణాల ద్వారా మెదడు మనకు చెబుతుంది. 
1. వాంతులు, వికారం
2. మెడ పట్టేయడం
3. చూపు మందగించడం
4. కాంతిని చూడలేకపోవడం
5. మూర్ఛ
6. కళ్లు గుడ్లు ముందుకు పొడుచుకొచ్చినట్టు అనిపించడం
7. తికమక పడడం
8. స్పృహ కోల్పోవడం
9. విపరీతమైన తలనొప్పి


ఎందుకొస్తుంది?
ఈ సమస్య ఎందుకొస్తుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు వైద్యులు. చాలా కారణాలు ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా మెదడులో ఉన్న ధమనుల్లోనే ఇదొచ్చే అవకాశం అధికం. ధమని గోడలు బలహీనంగా మారాక వాటి పొరలు ఉబ్బడం మొదలవుతాయి. ధమని గోడలను బలహీనపర్చే అనేక కారకాలు ఉన్నాయి. 


1. వయసు పెరగడం
2. ధూమపానం
3. అధిక రక్తపోటు
4. కొకైన్ వంటి డ్రగ్స్ వాడడం
5. ఆల్కహాల్ అధికంగా తాగడం
6. తలకు దెబ్బ తగిలిన సందర్భాల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. 


ఎన్నాళ్లు బతికే ఛాన్స్
ఈ సమస్య వచ్చిన వారిలో బతికే అవకాశాలు 60 శాతం మాత్రమే. ఈ సమస్య తీవ్రత తగ్గి జీవించిన వారిలో 66 శాతం మందిలో శాశ్వతంగా నరాల లోపం ఉంటుంది. కొన్ని పనులు చేయడంలో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యకరమైన వ్యక్తిలా సాధారణ జీవితం కష్టమే. 


Also read: పిల్లల దుస్తుల్లో 60 శాతం విష రసాయనాలు, గ్రీన్ సర్టిఫికెట్ అబద్ధమే


Also read: సెలెబ్రిటీలు వీగన్లుగా ఎందుకు మారుతున్నారు? ఈ డైట్ వల్ల లాభాలేంటి?