కిడ్నాప్‌లు చాలా రకాలు ఉంటాయి. కొందరు డబ్బులు, వివిధ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం కిడ్నాప్‌లు చేస్తారు. కొన్ని ముఠాలు మనుషులను అక్రమంగా తరలించేందుకు లేదా వారి అవయవాల కోసం అపహరణలకు పాల్పడుతుంటారు. అయితే, ఈ కిడ్నాపర్లు మాత్రం వేరే టైపు.. వీరు రక్తాన్ని పీల్చేసే రకాలు. 


చైనాలోని షెన్జేన్, బీజింగ్ నగరాల్లో సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్న 31 ఏళ్ల వ్యక్తి (ప్రైవసీ నిమిత్తం పేరు గోప్యంగా ఉంచారు) ఆన్‌లైన్‌లో ఓ ఉద్యోగ ప్రకటన చూసి.. జాబ్ మారాలని అనుకున్నాడు. నైరుతి చైనాలోని గ్వాంగ్జి(Guangxi) నగరంలో ఓ నైట్ క్లబ్‌లో బౌన్సర్‌ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలియడంతో అక్కడికి బయల్దేరాడు. ఇంటర్వ్యూకు అన్నివిధాల సిద్ధమయ్యాడు. కానీ, అది ఉద్యోగం కాదని, ఓ ట్రాప్ అని తెలుసుకోలేకపోయాడు. 


ఓ క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ కోసం వేసిన ఈ వ్యూహంలో అనుకోకుండా చిక్కుకున్న అతడు.. ఆ తర్వాత నరకం అనుభవించాడు. ఇంటర్వ్యూ కోసం గదిలోకి ఎంట్రీ ఇవ్వగానే కొంతమంది వ్యక్తులు అతడిని బంధించారు. ఆ తర్వాత అతడిని వియత్నాం మీదుగా కంబోడియా తీర ప్రాంత నగరం సిహనౌక్విల్లేకు తరలించారు. అక్కడ ఓ లోకల్ గ్యాంగ్‌కు రూ.13 లక్షలకు అతడిని అమ్మేశారు. ఆ గ్యాంగ్ అతడితో టెలి మార్కెటింగ్ స్కీమ్‌లతో మోసాలు చేయించారు. ప్రజలను చీటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. అంతేగాక అతడి నుంచి రక్తాన్ని కూడా తోడేసి బయట మార్కెట్లో విక్రయించేవారు. 


గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ప్రతి నెల 800 మిల్లీ లీటర్ల చొప్పున అతడి నుంచి రక్తాన్ని తోడేసేవారు. బ్లడ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం రక్తదానం చేసిన 56 రోజుల వరకు ఎవరికీ రక్తం ఇవ్వకూడదు. అయితే, కిడ్నాపర్లు అతడి నుంచి ప్రతి నెల రక్తాన్ని లాగేసేవారు. అతడి శరీరం నుంచి దాదాపు రక్తం మొత్తం తీసేశారు. కాళ్లు, చేతుల రక్త నాళాల నుంచి రక్తం రావడం నిలిచిపోవడంతో అతడి తలలోని సిరల నుంచి కూడా రక్తాన్ని తోడేశారు. ఫలితంగా అతడు బాగా నీరసించిపోయాడు. 


Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?


ఓ రోజు అతడికి కాపలాగా ఉన్న కిడ్నాపర్లు డ్యూటీ మారే సమయాన్ని గమనించి.. బాధితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. అక్కడి నుంచి ఎంతో కష్టం మీద చైనాకు చేరుకుని హాస్పిటల్‌లో చేరాడు. అతడి శరీరంలో రక్తం మొత్తం ఇంకిపోవడం వల్ల కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. అతడితోపాటు మరో ఏడుగురు కూడా అక్కడ బందీలుగా ఉన్నారని బాధితుడు తెలిపాడు. అయితే, కేవలం తన రక్తాన్ని మాత్రమే తీసుకొనేవారని తెలిపాడు. సహకరించకపోతే అవయవాలు తొలగిస్తామని బెదిరించేవారని తెలిపారు. అతడి రక్తాన్ని మాత్రమే ఎందుకు తోడేస్తున్నారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తే.. అసలు విషయం తెలిసింది. అతడి బ్లడ్ గ్రూప్ ‘O’ పాజిటివ్ కావడంతో కిడ్నాపర్లు, ఆ రక్తాన్ని తోడేసి బ్లాక్ మార్కెట్లో అమ్ముకొనేవారని తెలిపాడు. ‘O’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ చాలా అరుదైనది, ఇది యూనివర్శల్ కావడంతో ఎలాంటి బ్లడ్ గ్రూప్ వారైనా దీన్ని పొందవచ్చు. దీంతో బ్లాక్ మార్కెట్లో ఈ గ్రూప్ రక్తానికి భారీ డిమాండ్ ఉంది. ఈ ఘటన తర్వాత చైనా అధికారులు అప్రమత్తమయ్యారు. కాంబోడియా ఉద్యోగ ప్రకటనలను చూసి మోసపోవద్దని హెచ్చరించారు. 


Also Read: భర్త వీర్యాన్ని కేకులు, డ్రింక్స్‌లో కలిపి విద్యార్థులకు పంచిన టీచర్, చివరికిలా చిక్కింది