దోశకు ఫ్యాన్స్ ఎక్కువ. మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ... ఇలా చాలా తిని ఉంటారు కదా. ఇప్పుడు చికెన్ దోశ తిని చూడండి. రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి తింటే మీరే మీరే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. చేయడం కూడా చాలా సులువు. మసాలా దోశలాగే ముందుగా కూర వండుకుని, తరువాత దోశపై వేసుకుని తినడమే. 


కావాల్సినవి
దోశ పిండి - ఒక కప్పు
చికెన్ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - పావు టీస్పూను
కారం - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను
టమోటా ప్యూరీ - ఒక స్పూను
కరివేపాకులు - ఒక రెమ్మ
జీలకర్ర - అర టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - సరిపడినంత
కొత్తిమీర తరుగు - ఒక టీస్పూను


తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. 
2. అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ కూడా వేసి వేయించాలి. కరివేపాకులు కూడా వేసి కలపాలి. 
3.   అన్నీ బాగా వేగాక కారం, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర తరుగు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. 
4. అన్నీ వేగాక అరకప్పు నీళ్లు వేయాలి. నీల్లు సలసల కాగుతున్నప్పుడు చికెన్ ముక్కులు వేసి కలపాలి. 
5. చికెన్ ముక్కల్లో ఎముకలు లేకుండా చూసుకోవాలి. అలాగే చికెన్ దోశ కోసం చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 
6. చిన్నమంట మీద ముక్కలు ఉడికేలా ఉడికించాలి. చికెన్ మిశ్రమం చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 
7. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కాక దోశ పిండితో దోశ పోయాలి. 
8. దోశ పైన చికెన్ మిశ్రమం పరవాలి. 
9. అయిదునిమిషాలు దోశెను వేగనిస్తే చికెన్ దోశ రెడీ. 
దీనికి ఏ చట్నీ అవసరం లేదు. చికెన్ మిశ్రమంతోనే దోశెను తినేయచ్చు.వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరు. 


Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే



Also read: పొట్ట ఆరోగ్యానికి బీరు మంచిదేనంట, చెబుతున్న కొత్త అధ్యయనం


 Also read: పన్నెండు కిలోల ఆ బంగారు నాణెం ఎక్కడుంది? ఎందుకు మనదేశం దాని కోసం వెతుకుతోంది?