‘బీన్’ సినిమా చూశారా? అందులో మిస్టర్ బీన్‌ను ఓ గ్యాలరీలో ఉద్యోగం కోసం తీసుకుని వస్తారు. అయితే, అతడు కుదురుగా ఉండకుండా.. ఓ విలువైన పెయింట్ దగ్గరకు వెళ్లి పరిశీలిస్తాడు. అప్పుడు అతడికి గట్టిగా తుమ్ము వస్తుంది. దీంతో తుపర్లు వెళ్లి ఆ పెయింటింగ్‌లో ఉన్న మహిళ ముఖం మీద పడతాయి. తన జేబులో రుమాలు తీసి.. ఆ పెయింటింగ్‌ను తుడుస్తాడు. దీంతో పెయింట్ మొత్తం పోతుంది. దాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు అతడు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. అది సినిమా కాబట్టి సరదాగా నవ్వేసుకున్నాం. మరి, నిజ జీవితంలో కూడా బీన్స్ తరహా వ్యక్తులు ఉంటారా? సందేహమే లేదు.. రష్యాలోని ఓ సెక్యూరిటీ గార్డు మిస్టర్ బీన్‌లాగే దారుణమైన చిలిపి పని చేశాడు. చివరికి అది అతడి ఉద్యోగానికే ఎసరు పెట్టింది. 


రష్యాలోని యెకాటెరిన్‌బర్గ్‌లోని యెల్ట్‌సిన్ సెంటర్‌లో అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్భంగా ఓ ఖరీదైన పెయింటింగ్ ఏర్పాటు చేశారు. సందర్శకులు వాటిని నష్టపరచకుండా, చోరీకి గురి కాకుండా ఉండేందుకు ఓ సెక్యూరిటీ గార్డును నియమించారు. రోజంతా ఆ పెయింటింగ్‌లకు కాపలా కాసి బోరు కొట్టిందో ఏమో.. ఆ సెక్యూరిటీ గార్డుకు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. అతడి కళ్లు.. అన్నా లెపోర్స్కాయ అనే ఆర్టిస్ట్ గీసిన ‘త్రీ ఫిగర్స్’ అనే పెయింటింగ్ మీద పడ్డాయి. ఆ పెయింటింగ్‌లో ఉన్న ముగ్గురు మనుషుల ఆకారాలకు కళ్లు లేవు. బహుశా ఆ పెయింటర్ వాటికి కళ్లు పెట్టడం మరిచిపోయాడనుకుని తన దగ్గర ఉన్న బాల్ పెన్‌తో రెండు బొమ్మలకు గుండ్రంగా కళ్లు గీసి మురిసిపోయాడు. 


Also Read: ‘ఆలు’తో పాలు, బంగాళా దుంపలను ఇలా కూడా వాడేయొచ్చా? పిచ్చి ముదిరితే ఇంతేనేమో!


ఈ ఘటన గతేడాది డిసెంబర్ 7న చోటుచేసుకుంది. అయితే, ఆ పని చేసింది ఎవరనేది మాత్రం గ్యాలరీ నిర్వాహకులు తెలుసుకోలేకపోయారు. ఆ పని చేసింది సెక్యూరిటీ గార్డేనని తెలిసి ఆశ్చర్యపోయారు. బోరు కొట్టి ఏం చేయాలతో తెలియక అతడు ఆ పనికి పాల్పడ్డాడని, అతడిని వెంటనే విధుల నుంచి తొలగించామని తెలిపారు. ఆ పెయింటింగ్‌ విలువ సుమారు 740,000 పౌండ్లు (రూ.7.55 కోట్లు) ఉంటుందని అంచనా. చిత్రకారుడు అన్నా అంత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను అల్ఫా ఇన్సురెన్స్ కంపెనీలో భీమా చేయించాడు. సెక్యూరిటీ గార్డు నిర్వాకం వల్ల అది ఎందుకు విలువలేకుండా పోయింది. దీంతో దాన్ని మస్కోలోని రిస్టోరేషన్ ఎక్స్‌పర్ట్‌కు పంపించారు. కొద్దిగా కూడా ఆ పెయింటింగ్‌ను నష్టం వాటిల్లకుండా దాన్ని మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చారు. ఇందుకు 2,470 పౌండ్లు (రూ.2.52 లక్షలు) ఖర్చయ్యాయి. ఈ మొత్తాన్ని ఆ సెక్యూరిటీ గార్డు నుంచే వసూలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే, అతడి పేరును మాత్రం గోప్యంగా ఉంచారు. (ఆ పెయింటింగ్‌ను కింది ట్వీట్లో చూడండి).






Also Read: నగ్నంగా నిద్రపోతే ఇన్ని ప్రయోజనాలా? పరిశోధకులు ఏమంటున్నారు?