బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల చాలా మంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు? పొద్దున్నే తినలేదు కదా అని ఆ వాటా కూడా మధ్యాహ్నం లాగించేస్తారు. దాని వల్ల పొట్ట బిర్రుగా అనిపించడమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేస్తాయి. తరచూ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల దాని ప్రభావం రోగనిరోధక శక్తి మీద తీవ్రంగా పడుతుందని సరికొత్త అధ్యయనం వెల్లడించింది. అంతే కాదు అంటు వ్యాధులతో పోరాడటం కష్టం చేస్తుంది. గుండె జబ్బులను అభివృద్ధి చేసే అవకాశాన్ని పెంచుతుంది. మౌంట్ సినాయ్ కి చెందిన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇటీవల ఒక అధ్యయనం విడుదల చేసింది.


బ్రేక ఫాస్ట్ చేయకపోవడం వల్ల రోగనిరోధక కణాలకు హాని కలిగించే విధంగా మెదడు ప్రతిస్పందిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అప్పుడప్పుడు ఉపవాసం చేయడం ఆరోగ్యకరమని అంటున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయని పలు ఆధారాలు ఉన్నాయి. అయితే బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఉపవాసం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేందుకు రెండు ఎలుకల సమూహం మీద పరిశోధన జరిపారు.


పరిశోధన సాగింది ఇలా..


కొన్ని గంటల ఉపవాసం నుంచి 24 గంటల పాటు ఉపవాసం చేస్తే ఎటువంటి ప్రభావం ఉంటుందనేది గుర్తించారు. ఒక ఎలుకల సమూహానికి మేల్కొన్న వెంటనే అల్పాహారం ఇచ్చారు. మరొక సమూహానికి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వలేదు. ఎలుకలు మేల్కొన్న దగ్గర నుంచి 4 - 8గంటల వరకు రెండు గ్రూపుల్లో రక్తనమూనాల్ని సేకరించి పరీక్షలు జరిపారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎలుకల సమూహంలోని మోనోసైట్ సంఖ్యలో తేడాను గమనించారు. ఇది ఎముకల మజ్జలో తయారవుతుంది. శరీరంలో తెల్ల రక్తకణాలతో పాటు శరీరమంతా ప్రయాణిస్తాయి. అంటు వ్యాధులతో పోరాడటం దగ్గర నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలను అడ్డుకోవడం వరకు కీలక పాత్ర పోషిస్తాయి.


బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే వచ్చే అనార్థాలు  


బ్రేక్ ఫాస్ట్ చేయని ఎలుకల్లో తొలుత మోనోసైట్ లు ఉన్నాయి. కానీ నాలుగు గంటల తర్వాత అవి తగ్గిపోయాయి. ఎనిమిది గంటల తర్వాత పరిశీలిస్తే రక్తంలో అవి 90 శాతం కనుమరుగైనట్టు పరిశోధకులు గుర్తించారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన్ సమూహంలో మాత్రం మోనోసైట్లలో ఎటువంటి మార్పులు లేవు. బ్రేక్ ఫాస్ట్ చేయని ఎలుకల్లో మోనోసైట్లు నిద్రాణస్థితికి అంటే తిరిగి ఎముక మజ్జకు ప్రయాణించాయని పరిశోధకులు కనుగొన్నారు. ఎముక మజ్జలో కొత్త కణాల ఉత్పత్తి తగ్గింది. 24 గంటల వరకు వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా ఉపవాసం కొనసాగించారు. తర్వాత ఆహారాన్ని పెట్టగానే ఎముక మజ్జలో ఉన్న మోనోసైట్ కొన్ని గంటల్లోనే రక్తప్రవాహంలోకి చేరాయి. ఇలా ఒక్కసారిగా రక్తప్రవాహంలోకి కలవడం వల్ల అవి శక్తివంతంగా ఉండలేవు. ఫలితంగా శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడటానికి సమర్థవంతంగా పని చేయలేవు.


ఈ పరిశోధన ఉపవాస సమయంలో మెదడు, రోగనిరోధక శక్తి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించాయి. మరో వైపు అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వస్తున్నాయని అందుకే దీని మీద మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మోనోసైట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులని నియంత్రించంలో కీలకంగా వ్యవహరిస్తాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్!