AP Governament Adani Tension : అదానీ గ్రూపు సంసస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో ఆ సంస్థ సంక్షోభంలో చిక్కుకుపోయింది. దీంతో ఎంతో ఉద్దృతంగా పెట్టాలనుకున్న పెట్టుబడుల పరిస్థితి అనుమానంగా మారింది. ఈ ప్రభావం ఎపీపై ఎక్కువే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో సంప్రదాయేతర ఇంధన విద్యుత్ సహా అనేక రంగాల్లో అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టాలనుకుంది. కానీ ఇప్పుడు పెట్టుబడులపై పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


అదానీ  గ్రీన్ పెట్టుబడులు ఆలస్యం ఖాయమే ! 
 
ఏపీలో వివిధ ప్రాంతాల్లో 3,700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. నాలుగు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్లకు 15,376 కోట్ల రూపాయలను ఆ సంస్థ ఖర్చు చేయాల్సిఉంది. దీనికోసం 11,000 ఎకరాలు అవసరమవుతాయని దశల వారిగా ఈ మేరకు కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు  ఇచ్చిన అనుమతుల ప్రకారం 2022-23లోనే ఆ సంస్థ 1,349 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సిఉంది. అయితే ఇప్పటి వరకు ఒక శాతం కూడా ఖర్చు చేయలేదు.  అదే సమయంలో భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదముద్ర పడకముందే వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఈ నెల 8వ తేదిన భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోగా అంతకు నెల రోజుల ముందు నుండే ఆ భూముల్లో అదాని సిబ్బంది పనులు చేయడం ప్రారంభించారు. ఎకరా ఐదు లక్షల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.  తాజాగా అదాని గ్రీన్‌ ఎనర్జీ చేరింది. 2023-24 సంవత్సరంలో ఖర్చు చేయతలపెట్టిన 10వేల కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయాన్ని సమీక్షించాలని ఆ సంస్థ నిర్ణయించింది. వాస్తవానికి 2023-24తో పాటు 2024-25లో కూడా పది వేల కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయనున్నట్లు హిండెన్‌బెర్గ్‌ నివేదికకు వారం రోజుల ముందు ఆ సంస్థ ప్రకటించింది. అయితే, ఆ నివేదిక విడుదల తరువాత భారీ మార్పు వచ్చింది. 'మా లక్ష్యాలు నెమ్మదించే అవకాశం ఉంది. పెట్టుబడి వ్యయపు అంచనాలను సమీక్షించి, కొంత మేర తగ్గించాలని భావిస్తున్నాం' అంటూ ఫిక్స్‌డ్‌ ఇన్‌కం ఇన్వెస్టర్లకు తెలియచేసింది. అంటే పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గినట్లే భావిస్తున్నారు.ఇది ఏపీ పారిశ్రామికానికి పెద్ద దెబ్బే. 


విశాఖ డేటా సెంటర్ శంకుస్థాపన కూడా వాయిదా ! 


విశాఖలో మార్చి మూడు, నాలుగు తేదీల్లో గ్లోబల్‌ ఇన్విస్టెమెంట్‌ సమ్మిట్‌ జరుగనున్న దృష్ట్యా అదానీ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉంది.  విశాఖలోని మధురవాడ సర్వే నెంబరు 409లో 130 ఎకరాలను 'అదానీ గ్రూప్‌ డేటా ఎనలటిక్స్‌ సెంటర్‌ (డిఎసి)' కోసం  కేటాయించింది.  రూ.4 వేల కోట్లకు పైగా ఉన్న స్థలాన్ని కేవలం రూ.130 కోట్లుకే కారుచౌకగా అదానీ డేటా సెంటర్‌ కోసం జగన్‌ ప్రభుత్వం ఇచ్చేసిందని... నిబంధనలకు విరుద్ధంగా సేల్ డీడ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భూములను  జాతీయ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లుగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మరో అరవై ఎకరాలను కేటాయించారు. ఇంకా కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే పెట్టుబడులు పెట్టకపోతే మాత్రం ఇదో పెద్ద స్కామ్ గా విపక్షాలు ఆరోపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డేటా  సెంటర్ కు అదానీ గ్రూప్ పెట్టుబడులు సమకూర్చడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


ఏపీలో ఇతర రంగాల్లోని అదానీ ప్రభావం ! 


అదానీ గ్రూప్ పెట్టుబడి వ్యయాన్నే సమీక్షిస్తున్నందున ఆ ప్రభావం ఏపీపై పడితే   అటు పరిశ్రమలు రాక, ఇటు భూములు సాగు లేని ప్రమాదం ఏర్పడుతుంది. ఇ  కొన్ని చోట్ల అదాని గ్రీన్‌ ఎనర్జీకి భూములను లీజుకిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. లీజు చెల్లించడంలో విఫలమైతే ఎలా అన్న ప్రశ్నకు వారి నుండి సమాధానం రావడం లేదు. ఇది రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. అదానీ గ్రూపు ఇప్పటికే కృష్ణపట్నం , గంగవరం పోర్టులను సొంతం చేసుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆ కంపెనీకే ఇవ్వబోతున్నారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ ఆగిపోయింది. 


ఎలా చూసినా అదానీ గ్రూప్ సంక్షోభం ఏపీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపనుంది. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో అదానీ గ్రూప్ తరపున గౌతమ్ అదానీ పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ గ్రూప్ పెట్టుబడుల ప్రణాళికలు ఏమైనా వివరిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.