బాహుబలి థాలి చూసే వాహ్వా అనుకున్నారంతా. ఆ థాలి తింటే లక్ష రూపాయలు సొంతం చేసుకోవచ్చని కొన్ని రెస్టారెంట్లు ఛాలెంజ్‌లు కూడా విసిరాయి. ఇప్పుడు ఆ ఛాలెంజ్‌లు కనుమరుగయ్యే భారీ పారితోషికంతో ఛాలెంజ్ విసిరింది ఓ దిల్లీ రెస్టారెంట్.  ఆర్డౌర్ 2.0 అని పిలిచే ఈ రెస్టారెంట్ వారు తాము పెట్టిన ‘ఐరన్ మ్యాన్ థాలి’ తినమని ఆహ్వానిస్తోంది. ఆ థాలిని అరగంటలో పూర్తి చేస్తే ఎనిమిదన్నర లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ థాలిని ఒక్కరే కాదు, ఇద్దరు కలిసి పూర్తి చేయచ్చు. ఈ ఛాలెంజ్ విసిరి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎవరూ గెలవలేదు. 


ఏమేమి ఉంటాయ్...
‘ఐరన్ మ్యాన్ థాలి’లో పదిహేను రకాలకు పైగా ఆహారపదార్థాలు ఉంటాయి. బిర్యానీలు, అన్నం, చపాతీలు, టిక్కా, కబాబ్స్, దమ్ ఆలూ, ఆలూ గోబి, షాహీ పనీర్, కడాయ్ పనీర్, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, వేపుడు వంటకాలు, స్వీటు... ఇలా చాలా ఐటెమ్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఇద్దరు కలిసి 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇంతవరకు చాలా మంది ప్రయత్నించారు. భోజనప్రియులకు ఈ ఛాలెంజ్ రుచికరమైన ఆహారంతో పాటూ డబ్బును సంపాదించి ఇస్తుంది. యమ్ యమ్ ఇండియా అనే బ్లాగర్ ఇన్ స్టాలో ఈ థాలికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇది చూసిన వారు మంచి ఆఫర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పోస్టును 11 లక్షల మంది వీక్షించారు. 98 వేల మంది లైక్ చేశారు. ఈ పోటీలో పాల్గొన్ని ఓడిపోయిన వారు థాలీ చాలా రుచికరంగా ఉందని, కానీ పూర్తి చేయడం మాత్రం సవాలుగా మారిందని తమ అనుభవాన్ని పంచుకున్నారు. 






Also read: యాంటీ క్యాన్సర్ డ్రింక్‌గా దేశీ టీ, తయారీ విధానం ఇదిగో...