ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. వారిలో ఒకరు ఎప్పుడూ హడావిడి చేస్తూ.. ఇతరులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారు. ఇంకొకరు.. ప్రపంచంతోనే మాకు సంబంధం లేదన్నట్లుగా.. నిశబ్దంగా పనులు చేసుకుపోతారు. దురదృష్టం ఏమిటంటే.. ఈ ప్రపంచం నిశబ్దంగా ఉండేవారిని అంత త్వరగా అర్థం చేసుకోలేదు. కానీ, హడావిడి చేసేవాళ్లను మేథావులు, కలివిడి కలిగిన వ్యక్తులుగా భావిస్తుంది. నిశబ్దంగా ఉండేవారికి పనులే చేతకావని, లోక జ్ఞానం కూడా అంతంత మాత్రమేనని అనుకుంటుంది. అయితే, వాస్తవం వేరు. 


సాధారణంగానే మనం గట్టిగా మాట్లాడేవారిపై ఎక్కువ శ్రద్ధ పెడతాం. దానివల్ల నిశబ్దంగా ఉండేవారి శక్తిని తక్కువ అంచనా వేస్తాం. పార్టీలైనా, వ్యాపార సమావేశాలైనా, మరే సమావేశమైనా.. ఎక్కువగా మాట్లాడేవారే దృష్టిని ఆకట్టుకుంటారు. ఇలాంటివారు చాలా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారని, ముఖ్యంగా సామాజిక అంశాల్లో నైపుణ్యం, ఇతరులను తమ వైపు ఆకర్షించుకోవడంలో ముందుంటారని మానసిక నిపుణులు చెబుతుంటారు. అలాగని నిశబ్దంగా ఉండేవారిని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే.. పార్టీల్లో గానీ, సమావేశాల్లోగానీ నిశబ్దంగా ఉండే వ్యక్తులు చాలా తక్కువ మాట్లాడతారు. కానీ, ఎక్కువ వింటారు. చివరికి వారు మాట్లాడేప్పుడు మిగిలినవాళ్లు నోరెళ్లబెడతారు. 


ఈ సమాజంలో పనిచేయడానికి ఈ రెండు రకాల మనుషులు చాలా ముఖ్యం. మనస్తత్వాలను బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. కానీ, ప్రస్తుత సమాజంలో ఎక్కువగా హడావిడి చేసేవారినే అతిగా నమ్ముతున్నారు. ఇలా చేయడం వల్ల నిశబ్దంగా ఉండే వ్యక్తుల్లోని సృజనాత్మక ఆలోచనలను, ఐడియాలను తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు. అలా జరగకూడదంటే.. సైలెంట్‌గా ఉండే వ్యక్తులను మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులతో ఎంత కలిస్తే.. అన్ని పాజిటివ్ వైబ్స్ మీలో కలుగుతాయి. వారి నుంచి కూల్‌గా ఉండటాన్ని నేర్చుకోవచ్చు. అలాగే, సూటిగా సుత్తిలేకుండా మాట్లాడటం ఎలాగో తెలుసుకోవచ్చు. 


తక్కువ అంచనా వేయొద్దు: నిశబ్దంగా ఉండేవారు సమాజంలో కలవరని, వారికి అహంకారం ఎక్కువని భావిస్తారు. కానీ, వారి లోకం వేరుగా ఉంటుంది. వారి మనసులో ఎన్ని భావాలున్నా.. వాటిని మాటల్లో చెప్పలేరు. ఎప్పుడో తప్ప అవి బయటకు రావు. అయితే, వారిని చాలామంది తెలివి తక్కువ వాళ్లని భావిస్తారు. విషయావగాహన లేకపోవడం వల్లే నిశబ్దంగా ఉంటారని అనుకుంటారు. నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు బలహీనులని, పరిస్థితులకు లొంగిపోతారనే భావన కూడా ఉంది. కానీ, అందులో నిజం లేదు. ఇతరులతో పోల్చితే సైలెంట్‌గా ఉండేవారే ఎక్కువ బలమైనవారు. సృజనాత్మకంగా ఉంటారు. తెలివిగా ఉంటారు. సైలెంట్‌గా ఉన్నంత మాత్రాన్న చెడును సహిస్తారని అనుకోవద్దు. వారిని కదిపితే తట్టుకోలేరు. సైలెంట్‌గా ఉండే వ్యక్తులు శక్తివంతులని చెప్పడానికి ఈ 5 అంశాలే కీలకం. (‘లెర్నింగ్ మైండ్’ స్టడీ ఆధారంగా..):


1. లోతుగా ఆలోచిస్తారు: నిశబ్దంగా ఉండే వ్యక్తులు సైలెంట్‌గా ఉన్నారంటే వారు వింటున్నారని అర్థం చేసుకోవాలి. చాలామంది బిగ్గరగా మాట్లాడుతూ.. తమకు తెలిసిందే ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల చెప్పేది వినడానికి, ఆలోచించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. నిశబ్దంగా ఉండే వ్యక్తులు ఈ తప్పు చేయరు. శ్రద్ధగా విని, లోతుగా ఆలోచిస్తారు. తద్వారా.. చివరిగా మాట్లాడేప్పుడు వారు చెప్పేది ఇతరులకు చాలా అద్భుతంగా ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో గ్రూప్ డిస్కషన్స్ జరిగేప్పుడు.. అతిగా మాట్లాడేవారికి, ఇతరులు చెప్పేది విని మాట్లేవారికి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కాబట్టి.. ఇంటర్వ్యూలకు హాజరయ్యేప్పుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. నిశ్శబ్దంగా ఉండే వ్యక్తికి తమ కంటే తక్కువ జ్ఞానం లేదా తెలివితేటలు ఉన్నాయని.. ఎప్పుడూ అనుకోకూడదు. అలా చేస్తే, వారే తెలివి తక్కువవారు అవుతారు. ఇతరులను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. వారి చెప్పే అంశాన్ని శ్రద్ధగా వినాలి. దానిపై మీ అభిప్రాయాన్ని చెప్పాలి. 
 
2. ఎక్కువ గమనిస్తారు: సైలెంట్‌గా ఉండే వ్యక్తులను మోసం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వారు జరిగే ప్రతిదాన్ని జాగ్రత్తగా వింటారు, తెలుసుకుంటారు. అన్నీ నిశబ్దంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడతారు. కానీ, బిగ్గరగా మాట్లాడేవారు తమ వాగ్ధాటి, ఉత్సాహం ఇతరులను ఆకట్టుకుంటుందా లేదా అని చూసుకుంటారే గానీ, ఆలోచనలకు తగినట్లుగా మాట్లాడుతున్నామా లేదా అనేది తెలుసుకోరు. రెండిటిని బ్యాలెన్స్ చేయగలివారు చాలా తక్కువ మంది ఉంటారు. నిశబ్దంగా ఉండే వ్యక్తుల బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అసత్యాలు, మోసాలను వీరు చాలా సులభంగా గుర్తించగలరు. అందుకే, వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 


3. నిశ్శబ్దం బలహీనత కాదు: నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటారని అనుకుంటే పొరపాటే. వారు బిగ్గరగా అరుస్తూ.. అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేయకపోవచ్చు. కానీ, ఏదైనా తప్పు లేదా అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడగలరు. నిశ్శబ్దంగా ఉండేవారు తమని తాము రక్షించుకోవడంలో ఆచీతూచి వ్యవహరిస్తారు. ఎవరైనా వారిని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తే.. లోపల ఉన్నది బయట తీస్తారు. తమ ప్రతిస్పందనతో ఆశ్చర్యపరుస్తారు. అతనేనా ఇలా మాట్లాడుతున్నాడని షాకయ్యే అవకాశం కూడా ఉంది. సైలెంట్‌గా ఉండే వ్యక్తులు అధిక నైతిక ప్రమాణాలు కలిగి ఉంటారు. మంచికి మద్దతు ఇస్తారు.


4. సామాజిక అంశాల్లోనూ ప్రావీణ్యం: సైలెంట్‌గా ఉండే వ్యక్తులకు సామాజిక నైపుణ్యాలు ఉండవని భావిస్తారు. కానీ, వారు చాలా నిశబ్దంగా అవన్నీ గమనిస్తారనే విషయం చాలామందికి తెలీదు. ఇతరులతో వీరు గౌరవంగా ఉంటూ వారి గురించి తెలుసుకుంటారు. సన్నిహిత సంబంధాలను డెవలప్ చేసుకుంటారు. తమను నమ్మే వ్యక్తులకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. కావలసిన పనిని గౌరవంగా చెప్పి చేయించుకుంటారు. నిశబ్దంగా ఉండేవారు వివాదాల్లో తలదూర్చరు. అలాగే వివాదాలకు కేంద్రం బింధువు కూడా కాలేరు. అది వారికి ఇష్టం ఉండదు కూడా. చెప్పిన పని చేయడం లేదా చేయించడం, కొత్త ఐడియాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నించడం ఇదొక్కటే వారికి తెలుసు. ముఖ్యంగా బాసులకు భజన చేయడం వీరికి అస్సలు చేతకాదు. వీరు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పనిచేస్తారు. చెప్పాలంటే.. వీరు మౌనంగా ఉన్న మునులు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం వీరికి ఇష్టం. 


5. చెడు ప్రవర్తన సహించరు: అతిగా మాట్లాడేవారు లేదా హడావిడి చేసే వ్యక్తులు.. సైలెంట్‌గా ఉండేవారిని ఈజీగా వాడేసుకోవచ్చని అనుకుంటారు. కానీ, అది అంత సులభం కాదు. నిశబ్దంగా ఉండే వ్యక్తులకు సొంత భావాలను, విలువలను కలిగి ఉంటారు. ఎవరైనా వారికి విసుగు పుట్టించినా, చెడుగా ప్రవర్తించినా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి.. అలాంటి వ్యక్తులతో మంచిగా పనిచేయించుకోవాలే గానీ, రెచ్చగొట్టే పనులు చేయకూడదు. వారిని కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. అది జీవితంలోనైనా.. వృత్తిలోనైనా! కాబట్టి.. నిశబ్దంగా ఉండేవారికి కూడా విలువ ఇవ్వండి. వారి నోరు ఎప్పుడు మూసుకుని ఉన్నా.. వారి మనసు విశాలంగా ఉంటుంది. వారు ప్రేమించినంత గొప్పగా మరెవ్వరూ ప్రేమించలేరు. కానీ, వారు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు.


ఈ రకం సైలెంట్ కిల్లర్స్‌తో యమ డేంజర్: నిశబ్దంగా ఉండే వ్యక్తులంతా మంచివాళ్లని కూడా అనుకోవద్దు. అతిగా మాట్లాడే వ్యక్తుల్లో మోసగాళ్లు ఎలా ఉంటారో.. నిశబ్దంగా ఉండేవారిలో కూడా వీరిలో నేరాలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారు. వీరు చాలా సైలెంట్‌గా ఉంటారు. కానీ, లోపల చాలా క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరంగా ఉంటారు.


Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం


నిశబ్దంగా ఉండే వ్యక్తులు ఇతరులను చాలా సులభంగా మానిప్యులేట్ చేయగలరట. ముఖ్యంగా పాశ్చత్య దేశాల్లో నిశబ్దంగా ఉండే వ్యక్తులను ప్రమాదకరంగా భావిస్తారు. నిశబ్దంగా ఉంటే.. ఏదో తప్పు చేశారని అనుకుంటారు. అయితే, జపాన్‌లో మాత్రం ఇందుకు వ్యతిరేంగా ఆలోచిస్తారు. నిశబ్దాన్ని గౌరవం, జ్ఞానం, వ్యక్తిగత దూరానికి స్పష్టమైన సంకేతంగా భావిస్తారు. అయితే, కొందరు కావాలని నిశబ్దాన్ని పాటిస్తారు. సవాళ్ల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు. అలా ఎప్పుడూ నిశబ్దంగా ఉండటం కూడా మంచిది కాదు. అవసరమైన సమయంలో తప్పకుండా గళం వినిపించాలి. తమ వైఖరి తెలియజేయాలి. 


Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!