పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు.. లోతైన విచారణ కోసం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది.


లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులైన.. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్‌లను కస్టడీకి అప్పగించింది. ఈ నలుగురు నిందితులను మూడు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. నిందితులను మార్చి 26న సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.  మిగతా ముగ్గురు నిందితులు ఏ-10, ఏ-11, ఏ-12ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి (మార్చి 27) వాయిదా వేసింది. 


విచారణ సమయంలో సిట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసు కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం తెలపలేదని కోర్టుకు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారన్నదానిపై నిందితులు నోరు విప్పడం లేదన్నారు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని, మిగతావారి పాత్ర బయటపడాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ లీకేజీకి ఉపయోగించిన పరికరాలపై నిందితులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టు వివరించారు.


Also Read:


ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! 
తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు, ఇందులో పాత్రధారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తవ్వే కొద్ది అక్రమార్కులు బయటపడుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీలో కొందరు ఉద్యోగుల అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆడిందే ఆట.. పాడిందే పాటగా అన్నట్లు సాగింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి, ఇతరులకు లీక్ చేయడమే కాదు.. తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించారు. దొంగిలించిన ప్రశ్నపత్రం ఆధారంగా పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని మెరిట్ సాధించినట్లు గొప్పలకు పోయారు. ప్రశ్నపత్రాల లీకేజీలో తొలుత కమిషన్‌లోని ఇద్దరు ఉద్యోగుల పాత్ర మాత్రమే ఉందని భావించగా.. తాజా అరెస్టులతో మరికొందరు ఉద్యోగులు ఇందులో ఉన్నట్లు నిర్ధారణ అయింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


పేపర్ లీకేజీ ఎఫెక్ట్, ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్‌ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్‌ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 పేపర్‌ కోసం జూన్‌ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్‌ మొదటి వారంలో పేపర్‌ను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పేపర్‌ లీకేజీ ఘటనలో నిందితులుగా 9 మందిని మూడో రోజు సిట్‌ అధికారులు విచారించారు. వీరి నుంచి పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్‌, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...