TSPSC: తెలంగాణలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు జనరల్ ర్యాంకు మెరిట్ జాబితాల (జీఆర్‌ఎల్)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం (ఫిబ్రవరి 16న) రాత్రి విడుదల చేసింది. వీటిలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, హార్టికల్చర్ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా, 2023 మే, జూన్, జులై నెలల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.


Town Planning Building Overseer - General Ranking List


Drugs Inspector - General Ranking List


Horticulture Officer - General Ranking List


Agriculture Officer General - Ranking List


Librarian - General Ranking List


Assistant Motor Vehicles Inspector - General Ranking List



జనరల్‌ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు..


ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షల ఆధారంగా జనరల్ ర్యాంకుల జాబితాల (GRL) రూపకల్పనలో కమిషన్ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబరు 20 జారీచేసిన మార్గదర్శకాలకు సవరణలు చేసింది. అభ్యర్థులు రాత పరీక్షలో సమాన మార్కులు సాధించినపుడు ర్యాంకుల ఖరారులో అవలంబించాల్సిన విధానంపై స్పష్టత ఇచ్చింది. 2022 ఏప్రిల్ నుంచి టీఎస్‌పీఎస్సీ వెలువరించిన అన్ని నోటిఫికేషన్లకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ అధికారిక ప్రకటన విడుదలచేశారు.


మార్గదర్శకాలు ఇలా..


➥ టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏదైనా పరీక్షలో ఇద్దరి కంటే ఎక్కువ మందికి సమాన మార్కులొస్తే.. అభ్యర్థి స్థానికత ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. స్థానికత కలిగిన వారికి ఉన్నత ర్యాంకు, తెలంగాణేతరులకు ఆ తరువాత వచ్చే ర్యాంకు కేటాయిస్తారు. 


➥ మార్కులు, స్థానికత సమానంగా ఉన్నప్పుడు అభ్యర్థి పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ వయసు కలిగిని అభ్యర్థికి తొలి ర్యాంకు కేటాయిస్తారు. మార్కులు, స్థానికత, పుట్టినతేదీ సమానంగా ఉన్న పక్షంలో జనరల్ స్టడీస్ మినహా సబ్జెక్టుల పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు.


➥ అన్ని కేటగిరీల్లోనూ సమానంగా ఉంటే... ఆ పోస్టుకు కావాల్సిన విద్యార్హత(డిగ్రీ, డిప్లొమా, పీజీ ఇలా..) పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుని ర్యాంకు ఇస్తారు. (గతంలో పాసైన తేదీ కాకుండా పాసైన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న నిబంధన ఉండేది)


➥ అప్పటికీ అన్ని రంగాల్లో సమానంగా ఉంటే.. ఆ అర్హత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కువ పర్సంటైల్‌ సాధించిన వారికి ఉన్నత ర్యాంకు కేటాయిస్తారు.


➥ అక్కడా ఇద్దరికన్నా ఎక్కువమందికి సమానంగా ఉంటే ఉన్నత విద్యార్హతను పరిగణనలోకి తీసుకుంటారు.


➥ అప్పటికీ ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి సమానంగా ఉంటే ఆ ఉన్నత విద్యార్హతలో ఉత్తీర్ణత సాధించిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.


➥ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమందికి సమాన మార్కులు వస్తే.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...