TGPSC Group-1 Prelims: తెలంగాణలో జూన్ 9న (ఆదివారం) 'గ్రూప్-1' ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు కాావాల్సిన అన్ని ఏర్పాట్లను టీజీపీఎస్సీ (TGPSC) పూర్తిచేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం కోసం 895 కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. OMR విధానంలోనే పరీక్ష నిర్వహిస్తున్నారు.


అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందునుంచే అంటే.. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే అంటే.. ఉదయం 10 గంటలకే గేట్లు మూసివేయనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం. అభ్యర్థులు హాల్‌టికెట్, ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.


ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు...
గ్రూప్‌-1 ప్రిలిమనరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే సంస్థ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు రద్దీ ఎక్కువగా ఉందని గమనించిన ఆర్టీసీ.. శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ పాయింట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆయా ట్రాఫిక్‌ జనరేటింగ్‌ పాయింట్లలో ప్రత్యేక అధికారులను నియమించారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను వారు అందుబాటులో ఉంచుతారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన బస్‌ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో వెళ్లాలో అధికారులు చెబుతారు. 


డిక్లరేషన్ ఫామ్ మరచిపోవద్దు...
అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్‌‌లో ఫొటో, వివరాలు సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్‌ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ ద్వారా అటెస్ట్‌ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు. అదేవిధంగా హాల్‌టికెట్‌ను ఏ4 సైజులో ప్రింట్‌ తీసుకోవాలి. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్‌పోర్టు ఫొటోను అతికించాల్సి ఉంటుంది. ఫొటో లేని హాల్‌టికెట్లను పరిగణనలోకి తీసుకోరు. వారిని అనుమతించరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిక్లరేషన్/అథంటికేషన్ (ఫామ్-1, ఫామ్-2)లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. ఫొటోను సరిగా అప్‌లోడ్ చేయలేకపోయిన అభ్యర్థులు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను డిక్లరేషన్ ఫామ్-1కు జతచేయాల్సి ఉంటుంది. అలాగే పేరు తప్పుగా ఉన్న అభ్యర్థులు తమ పదోతరగతి లేదా డిగ్రీ సర్టిఫికేట్‌లో ఉన్న విధంగా పూర్తి పేరును డిక్లరేషన్ ఫామ్‌-2లో నమోదుచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ లేదా అభ్యర్థులు చివరిగా చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపల్ ద్వారా అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది.  


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫొటో అతికించాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


➥ అభ్యర్థులు బయోమెట్రిక్ తప్పనిసరి ఇవ్వాలి. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరి పాటించాలని తెలిపింది.


➥ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ మీద ఫొటో సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్‌ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు.


➥ అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి పంపిస్తారు. ఉదయం 10 గంటలకు గేట్లను మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమితించరు. ఉదయం 9.30 గంటల నుంచే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.


➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే పత్రాలు చెల్లుబాటు కావు. 


➥ పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డిజిటల్ వాచీలు, బ్లూటూత్ డివైజ్‌లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, రైటింగ్ పాడ్, నోట్స్, చార్టులు, ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు అనుమతించరు. 


➥ అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్షకు హాజరుకావాలి. షూ వంటివి ధరించకూడదు. 


➥ బ్లాక్ లేదా నీలం రంగు పెన్ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.  జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు. 


➥ అభ్యర్థులు OMR పత్రంలో ఏమైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా మరొకటి ఇవ్వరు. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. 


➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు). ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులలో నిర్ణీత నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.


ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.


గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Related Articles:


'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల - పరీక్ష వివరాలు, అభ్యర్థులకు మార్గదర్శకాలివే


గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - ఫొటోగ్రాఫ్, పేరు వివరాల్లో తప్పులుంటే ఇలా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే 


'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ఫొటో లేకపోతే 'నో ఎంట్రీ' - ఈ రూల్స్ పాటించాల్సిందే



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...