తెలంగాణలో పేపర్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు, ఇందులో పాత్రధారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తవ్వే కొద్ది అక్రమార్కులు బయటపడుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీలో కొందరు ఉద్యోగుల అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. ఆడిందే ఆట.. పాడిందే పాటగా అన్నట్లు సాగింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని దొంగిలించి, ఇతరులకు లీక్ చేయడమే కాదు.. తమకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరించారు. దొంగిలించిన ప్రశ్నపత్రం ఆధారంగా పరీక్షలో ఎక్కువ మార్కులు తెచ్చుకుని మెరిట్ సాధించినట్లు గొప్పలకు పోయారు. ప్రశ్నపత్రాల లీకేజీలో తొలుత కమిషన్‌లోని ఇద్దరు ఉద్యోగుల పాత్ర మాత్రమే ఉందని భావించగా.. తాజా అరెస్టులతో మరికొందరు ఉద్యోగులు ఇందులో ఉన్నట్లు నిర్ధారణ అయింది.


కార్యదర్శి బాధ్యతారాహిత్యం...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి పాలనాపరమైన అన్ని వ్యవహారాలు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. కమిషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారా? అని చూడాల్సిన బాధ్యత కూడా కార్యదర్శిదే. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంటే ప్రశ్నపత్రాల తయారీ, నిల్వ చేయడం, మూల్యాంకనం వంటి రహస్య కార్యకలాపాలన్నీ కార్యదర్శి అధీనంలోనే ఉంటాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కమిషన్ నిర్వహించే ఏ పరీక్ష రాయాలన్నా కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అనుమతి పొందిన ఉద్యోగులను సెలవుపై పంపించాలి. లేకుంటే పరీక్షల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్ల నుంచి వారిని దూరంగా పెట్టాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ఉద్యోగులపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రాత్రింబవళ్లూ సిద్ధమవుతుండగా వారు మాత్రం యథావిధిగా ఉద్యోగం చేసుకుంటూ పరీక్ష రాశారు. శాశ్వత, పొరుగు సేవల ఉద్యోగులు మొత్తం 20 మంది పరీక్ష రాయగా, వీరిలో ఎనిమిది మంది మెయిన్స్‌కు అర్హత సాధించడం గమనార్హం.


వారిద్దరి మార్కులను గుర్తించలేకపోయారు...
ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 121 మందికి 100 మార్కులకు పైగా వచ్చాయి. సాధారణంగా కమిషన్ నిర్వహించిన పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 20 మంది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను మరోసారి మాన్యువల్‌గా పరిశీలిస్తారు. కంప్యూటర్ మూల్యాంకనంలో ఏమైనా లోపాలు జరిగాయా? మార్కులు సరైనవేనా? అని పరిశీలిస్తారు. ఓఎంఆర్ పత్రాలు, కీని సరిచూస్తారు. ఏమైనా తేడా ఉన్నట్లు తేలితే మిగతా వాటినీ పరిశీలిస్తారు. మూల్యాంకనంలో తప్పులు దొర్లకుండా ఈ పద్ధతి అవలంబిస్తారు. అయితే కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు రమేష్, షమీమ్‌లకు 120కి పైగా మార్కులు వచ్చినా పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. వీరిద్దరికీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ అయినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. షమీమ్‌కు రాజశేఖర్, రమేష్‌కు ప్రవీణ్ ప్రశ్నపత్రం చేరవేసినట్లు గుర్తించారు.


Also Read:


'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!
రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతుంది. ఇకపై ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాతపరీక్షలను వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించే దిశగా.. ఆన్‌లైన్ విధానంవైపు అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


పేపర్ లీకేజీ ఎఫెక్ట్, ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ!
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇంటిదొంగలే మోసం చేశారని సాక్షాత్తు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ గోడు వెల్లబోసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌‌లో ప్రక్షాళన మొదలుపెట్టింది. కమిషన్‌లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్‌ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్‌ శ్రీకారం చుట్టింది. కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్‌ భావిస్తోంది. 
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!
టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్‌ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 పేపర్‌ కోసం జూన్‌ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్‌ మొదటి వారంలో పేపర్‌ను అపహరించినట్లు విచారణలో వెల్లడైంది. పేపర్‌ లీకేజీ ఘటనలో నిందితులుగా 9 మందిని మూడో రోజు సిట్‌ అధికారులు విచారించారు. వీరి నుంచి పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్‌, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..