Telangana SI Preliminary Exams must know these: తెలంగాణలో పోలీస్ పరీక్షలకు ఇటీవల నోటిఫికేషన్లు వచ్చాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కలిపి 538 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 503 సెంటర్లు, ఇతర పట్టణాల్లో 35 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB)  ఏర్పాట్లు చేసింది. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ బోర్డ్, పోలీసు శాఖ కొన్ని సలహాలిచ్చింది. పరీక్షకు హాజరు, పరీక్ష రాసే సమయంలో నిబంధనలు ఇలా ఉన్నాయి.


అభ్యర్థులు ఇవి తప్పనిసరిగా పాటించండి, బోర్డ్ సూచనలివే.. 
అభ్యర్థులకు హాల్ టికెట్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటే 93937 11110/ 93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 
support@tslprb.in కు వివరాలు పంపినా అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆదివారం (ఆగస్టు 7న) ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. పరీక్ష ప్రారంభం అయిన తరువాత ఒక్క నిమిషం లేటు అయినా అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు.
హాల్‌టికెట్లను A4 సైజ్‌ పేపర్ పైన మాత్రమే డౌన్ లోడ్ చేసుకుని ఉండాలని గతంలోనే అభ్యర్థులకు సూచించారు
ఎగ్జామ్ హాల్ టికెట్ కలర్ ప్రింటౌట్ అవసరం లేదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో హాల్ టికెట్ తీసుకున్నా సరిపోతుంది
హాల్ టికెట్ ఎడమవైపు కింది భాగంలో సూచించిన బాక్స్‌లో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను అతికించాలి. అయితే గుండు పిన్నుతో, పిన్నులతోగానీ ఫొటోలు స్టిక్ చేయవద్దు 
మీరు అతికించే పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో ఎగ్జామ్ అప్లికేషన్ సమయంలో అప్‌లోడ్‌ చేసిన ఫొటో లాంటిదే అయి ఉండాలి
ఫొటోలు అతికించకుండా ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు
అభ్యర్థులు బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులతో వస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు
చేతులకు మెహందీ, టెంపరరీ టాటూలు ఉంటే ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్‌లో బయోమెట్రిక్‌ విధానంలో హాజరు తీసుకుంటారు
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొబైల్స్‌, ట్యాబ్లెట్లు, పెన్‌ డ్రైవ్‌ లాంటివి ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు
బ్లూటూత్‌ డివైజ్‌, రిస్ట్‌వాచ్‌, పర్సు, పేపర్లు వెంట తెచ్చుకుంటే వీటిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు


రెండు దఫాల్లో పోలీస్ నియామక పరీక్షలు.. 
పోలీసు నియామక పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. ఎస్సై నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్న 554 పోస్టులకు ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. దీనికి హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని 20 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న 15, 644 ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్షను ఆగస్టు 21న నిర్వహిస్తారు. ఇది కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. ఈ రాత పరీక్ష కోసం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా 40 పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.


ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కూడా దీంట్లోనే కలిపేశారు.  ఇప్పుడు నిర్వహించే ప్రాథమిక పరీక్షలో చాలా మందిని స్క్రూట్నీ చేస్తారు. టాప్‌లో ఉన్న వారిని ఫిజికల్‌ టెస్టులకు పిలుస్తారు. అందులో మెరిట్ సాధించిన వాళ్లను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.