Group1 Prelims OMR Answer sheets: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల OMR ఇమేజింగ్ పత్రాలను (Answer sheets) జూన్ 24న సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదుచేసి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ జూన్ 21న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల పరిధిలో జూన్ 9న 897 పరీక్ష కేంద్రాల్లో టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


74.86 శాతం హాజరు నమోదు..
గ్రూప్-1 పరీక్ష కోసం మొత్తం 4,03,667 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,03,645 మంది అభ్యర్థలు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇందులో మొత్తం 3,02,172 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 74.86 శాతం హాజరు నమోదైంది. పరీక్షకు అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 61.78 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 




గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో పరీక్షలో పారదర్శకత కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే.. అభ్యర్థులకు జూన్ 9న OMR విధానంలో రాతపరీక్ష నిర్వహించింది.



తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకీ టీజీపీఎస్సీ (TGPSC) ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ని 'కీ'ని జూన్‌ 13న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జూన్‌ 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలు స్వీకరించింది. ఫైనల్ కీతోపాటు ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.


గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూలు..


➥ అక్టోబరు 21న జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)


➥ అక్టోబరు 22న పేపర్-1(జనరల్ ఎస్సే)


➥ అక్టోబరు 23న పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)


➥ అక్టోబరు 24న పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)


➥ అక్టోబరు 25న పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)


➥ అక్టోబరు 26న పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)


➥ అక్టోబరు 27న పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)


మెయిన్స్ పరీక్ష విధానం: మొత్తం 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ పేపరును కేవలం అర్హత పరీక్షకాగా.. మిగతా ఆరు పేపర్లను ప్రధాన పేపర్లుగా పరిగణిస్తారు. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయించారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.


గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పూర్తి షెడ్యూలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..





మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...