TGPSC Group1 Exam: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ముందుుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరుగనుంది. గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్ష నిర్వహణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని, ఈ సమయంలో పరీక్ష వాయిదాపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టంచేసింది. పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి, దీనిపై టీజీపీఎస్సీ (TGPSC) తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది. 


రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షను వాయిదావేయాలంటూ ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు జూన్ 1న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉండటంతో.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను వాయిదావేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై జూన్ 4న జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. 


ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణలో కేవలం 2 ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, అదే గ్రూప్-1 పోస్టులకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కేవలం కొంత మంది ప్రయోజనాల కోసం.. లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరికాదన్నారు. కమిషన్ న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయడానికి నిరాకరిస్తూ.. దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. కేసు విచారణను ముగించింది.


హాల్‌టికెట్లు అందుబాటులో..
తెలంగాణలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ జూన్ 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ మీద ఫొటో సరిగా లేకుంటే, అభ్యర్థి గెజిటెడ్‌ అధికారి లేదా విద్యార్థి గతంలో చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌ అటెస్ట్‌ చేసిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలతోపాటు కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అయితేనే పరీక్షకు అనుమతిస్తారు.


అభ్యర్థులకు అలర్ట్..
రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గత అనుభవాల నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మేరకు అభ్యర్థులకు కఠిన నిబంధనలు విధించింది. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించిన నియమ నిబంధనలు, OMR షీట్ నమూనాపత్రాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు (150 నిమిషాలు). ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులలో నిర్ణీత నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపికచేస్తారు.


పరీక్ష కేంద్రాలు..
ఆసిఫాబాద్-కొమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి-యాదాద్రి, జనగాం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్.


గ్రూప్-1 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Related Articles:


'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల - పరీక్ష వివరాలు, అభ్యర్థులకు మార్గదర్శకాలివే


గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - ఫొటోగ్రాఫ్, పేరు వివరాల్లో తప్పులుంటే ఇలా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే 


'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, ఫొటో లేకపోతే 'నో ఎంట్రీ' - ఈ రూల్స్ పాటించాల్సిందే



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..