TS Health Department Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో 1326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.  ఈ మేరకు మంత్రి హరీశ్ రావు కీలక ఆదేశాలు ఇచ్చారు. మొదటి దశ నోటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలని మెడికల్ బోర్డును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచించారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ నోటిఫికేషన్ లో 20 శాతం వెయిటీజీ కల్పించాలని సూచించారు. మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫకేషన్ ఇవ్వాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో  మొత్తం 1326 పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 


ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజి 


ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజి మార్కులు ఇవ్వాలన్నారు. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. టెక్నికల్ పోస్టులతో పాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్ లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని మంత్రి సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలన్నారు.


కోవిడ్ లో పనిచేసిన వారికి వెయిటేజి 


ఆయుష్  విభాగంలోని స్టాఫ్ నర్సుల పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 34, 35 ను సవరించి నియామకాలు చేపట్టాలన్నారు. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. 80 శాతం రాత పరీక్షకు మార్కులు, 20 మార్కులు కోవిడ్ కాలంలో పని చేసిన వారికి వెయిటేజి మార్కులు ఇవ్వాలన్నారు. ఆయుష్  వైద్యులను టీచింగ్ స్టాఫ్ గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అందులోని ఖాళీలను వచ్చే నోటిఫికేషన్  ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్ లో సవరణలు చేయాలన్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ ను  రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీశ్ రావు వైద్యశాఖాధికారులను ఆదేశించారు.


మొదటి విడతలో 1326 పోస్టులు


ఎన్.హెచ్.ఎంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు, ఏం పని చేస్తున్నారు అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్.హెచ్.ఎం డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లు స్టైఫండ్ గా ఇస్తున్నామని, వారి సేవలు చక్కగా వినియోగంచుకునేలా విధి విధానాల రూపకల్పన చేయాలన్నారు. ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్ లో ట్యూటర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయన్నారు.  ఎంబీబీఎస్ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వెయిటేజి మార్కులు,  మిగతా 80 శాతం మార్కులు వారు ఎంబీబీఎస్  డిగ్రీలో సాధించిన మార్కుల ఆదారంగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 1326 పోస్టులకు  నోటిటిఫికేషన్ జారీ చేయాలని,  ఆ తర్వాత వెంటనే  స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి సూచించారు.


మొత్తం 12,755 పోస్టుల భర్తీ 


ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన స్టాఫ్ట్ వేర్ సిద్ధమైందని మంత్రి  హరీశ్ రావుకు అధికారులు తెలిపారు. ఈ రెండు, మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ తెలిపారు. వైద్యారోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్క మెడికల్ బోర్డు ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది. ఈ క్రమంలో తొలిదశలో భాగంగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.