TSTET 2024 Fees Issue: తెలంగాణలో టెట్ పరీక్ష ఫీజులు భారీగా పెంచడంపై నిరుద్యోగులు, వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం దిగినట్లు తెలుస్తోంది. గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా... దాన్ని రూ.1000కి పెంచింది. ఇక రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గూబ గుయ్యిమనిపించింది.. గతంలో రూ.300 గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు పెంచేసింది.


ఈ నేపథ్యంలో ఫీజులను ఈ స్థాయిలో పెంచడంపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్, శిక్షణ, హాస్టల్ ఫీజులకే వేల రూపాయలు ఖర్చుపెడుతున్న తమకు పెరిగిన పరీక్ష ఫీజలు చెల్లించడం మరింత భారంగా మారిందని, ఇలా చేయడం తగదని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని కోరుతున్నారు.


ఫీజుల వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లింది. ఫీజుల పెంపు అధికారుల స్థాయిలోనే జరిగిందని సీఎంవో వర్గాలు సీఎంకి వెల్లడించినట్లు తెలిసింది. దీంతో సమస్య తీవ్రతరం కాకముందే ఫీజు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తులు..
రాష్ట్రంలో మార్చి 15న  టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో టెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.  


వీరు అర్హులు..


➥ టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.. ఒకవేళ అభ్యర్థులు 2015లోపు డీఈడీలో చేసిఉంటే జనరల్ అభ్యర్థులకుఇంటర్‌లో 45 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. 


➥ టెట్ పేపర్-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు ఉండాలి. 2015లోపు బీఈడీ అయితే జనరల్‌కి 50 శాతం, ఇతరులకు 40 శాతం మార్కులు ఉన్నా అర్హులే. సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు.


తెలంగాణ టెట్-2024 సమగ్ర నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


జూన్‌ 20 వరకు డీఎస్సీ దరఖాస్తు గడువు..
'డీఎస్సీ కంటే ముందే టెట్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులకు ప్రయోజనం కలుగనుంది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఎస్సీ రాతపరీక్షలను జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ నిర్వహణ తప్పనిసరి కావడంతో డీఎస్సీ దరఖాస్తు గడువును విద్యాశాఖ జూన్‌ 20 వరకు పొడిగించింది. డీఎస్సీకి దరఖాస్తు చేసేవారి సందేహాలు తీర్చేందుకు అధికారులు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేశారు. సాంకేతిక సహాయం కోసం విద్యార్థులు 91541 14982, 63099 98812 నంబర్లతోపాటు, helpdesk tsdsc2024@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.''


తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..