Telangana DSC 2024 Notification: తెలంగాణ(Telagnana)లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి సంబంధించి 'మెగా డీఎస్సీ-2024(Mega Dsc Notification2024 )' నోటిఫికేషన్ ఫిబ్రవరి 29న వెలువడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన నివాసం నుంచి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు.  వీటిల్లో గత కేసీఆర్‌ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్‌ పోస్టులు, మరో 1, 016 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు కలిపి మొత్తం 11, 062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. ఇక మొత్తంగా చూస్తే.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)(SGT Posts)-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్(School Assistants)-2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్(Laungage Pandi Posts)-727, పీఈటీలు(P.E.T. Posts)-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. 



మార్చి 4 నుంచి దరఖాస్తులు..
టీఎస్ డీఎస్సీ-2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచిన నేపథ్యంలో 46 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటన రద్దుకు ప్రభుత్వం ఫిబ్రవరి 28న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాతపోస్టులకు కొత్తగా ఖాళీలను జతచేస్తూ తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటిచే ప్రకటించారు. అంటే పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.


గతేడాది విడుదల చేసిన డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్‌బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉన్నది. మొత్తం 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌లో గణితం, ఫిజిక్స్‌ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


సమస్య తలెత్తకుండా అధికారుల జాగ్రత్తలు.. 
రాష్ట్రంలోని నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్‌వర్డ్స్, ఆన్‌లైన్‌ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.03.2024.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 02.04.2024.


➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.


Website



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..