YSRCP Manifesto: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేస్తున్న వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు జగన్ ముఖ్యనేతలతో దీనిపై చర్చించనున్నారు. రెండు కీలకమైన పథకాలపై వారితో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.  


జగన్ ప్రకటించబోయే రెండు పథకాల్లో ఒకటి డ్వాక్రా సంఘాల రుణాలకు  సంబంధించినది ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకొక పథకంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది రైతు రుణమాఫీ అంటున్నారు. ఇది 2014 ఎన్నికల్లో టీడీపీ మంచి మైలేజ్ తీసుకువచ్చిందని ఈసారి దాన్ని తమకు బ్రహ్మాస్త్రంగా మార్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు సరిగా అమలు చేయలేమని తాము వస్తే మాత్రం కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలను ఒప్పించబోతున్నారు. 


ఇది కూడా ఎక్కువ మంది ప్రజలు కవర్ అయ్యే పథకం అయి ఉంటుందని అంటున్నారు. ఈ రెండు కీలకమై పథకాలు అమలు చేయాలంటే కేంద్రం నుంచి సాయం తప్పనిసరి కావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. 


గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఎట్టకేలకు మార్చి మొదటి వారంలో దొరికింది. అందుకే సిద్ధం సభను వాయిదా వేసుకొని మరీ ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానిమంత్రి వద్ద ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు ప్రస్తావించి వారి అనుమతి తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయానికి జగన్ తీస్తారా అనే సందేహం కూడా ఉంది. 


మేనిఫెస్టో విషయంలో వైపీసీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని హామీలను గుర్తించి వాటిలో లోపాలు ఎత్తి చూపుతూ... కేవలం 9 హామీలతో 2019 మేనిఫెస్టో తయారు చేసింది. ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు సాధించింది. ఆ తొమ్మిది హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రచారం చేసింది. దీంతో 2019లో విజయం సాధించింది. వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పుకుంటుంది. 


ప్రచారంలో జగన్ ఇచ్చిన చాలా హామీలను వైసీపీ తన మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ వాటిని కూడా జనం నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు వైసీపీ మాత్రం 9 హామీలకే కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటోంది. వాటిలో కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం విషయంలో కూడా దాటవేత ధోరణి అవలంభిస్తోంది. అందుకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ప్రచారం చేస్తున్నారు. 


ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశామని ఇకపై కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు అభ్యర్థించనున్నారు. అందుకే ఈసారి కూడా ప్రస్తుతం ఇస్తున్న వాటిని కొనసాగిస్తూనే తక్కువ హామీలతోనే ప్రజల ముందుకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది.