YSRCP releases 8th list of incharges: అమరావతి: అధికార పార్టీ వైఎస్సార్ సీపీ (YSRCP) తాజాగా ఇంఛార్జ్‌ల 8వ జాబితా విడుదల చేసింది. మొత్తం 5 మంది నేతలకు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించింది. ఏపీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు 2 పార్లమెంటు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ మార్పులు చేర్పులు పోనూ 8వ లిస్టుతో కలిపి దాదాపు72 స్థానాలు ప్రకటించారు. 17 ఎంపీ స్థానాలు ప్రకటించినట్లయింది.


గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోశయ్య, ఒంగోలు ఎంపీ సీటు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్.. అసెంబ్లీ విషయానికొస్తే పొన్నూరు నుంచి అంబటి మురళి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి. నెల్లూరు స్థానానికి  కల్లత్తూర్ కృపాలక్ష్మికి సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


నియోజకవర్గం - పార్టీ సమన్వయకర్త
1. గుంటూరు ఎంపీ - కిలారు రోశయ్య
2. పొన్నూరు - అంబటి మురళి
3. ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
4. కందుకూరు - బుర్రా మధుసూదన్ యాదవ్
5. జి.డి. నెల్లూరు -  కల్లత్తూర్ కృపాలక్ష్మి


జాబితాల వారీగా ఎంత మందికి ఛాన్స్ ఇచ్చారంటే... 
ఇంఛార్జ్‌ల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో లిస్టులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇంఛార్జీలను ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ) కొత్త ఇంఛార్జిలను నియమించారు. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ వైసీపీ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్, 3 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌లను వైఎస్ జగన్ నియమించారు.