SSC Junior Engineer Exam Admitcard: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే 31న విడుదల చేసింది. రీజియన్లవారీగా అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5 నుంచి 7 వరకు దేశంలోని పలు ప్రధాన కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులకు పేపర్-1 (సీబీటీ), పేపర్-2 (డిస్క్రిప్టివ్), సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు సెవెన్త్‌ 'పే' స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం చెల్లిస్తారు. 


జూనియర్ ఇంజినీర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం..


✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశల కంప్యూటర్ ఆధారిత విధానంలోనే రాత పరీక్ష నిర్వహిస్తారు.


✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'‌కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.


పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్ రీజనింగ్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఇస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పేప‌ర్-1లో అర్హత‌ సాధించిన‌వారికి పేప‌ర్-2 ప‌రీక్ష నిర్వహిస్తారు.

✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. స‌ంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చర‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ లేదా మెకానిక‌ల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంట‌ల‌ు. పేపర్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజా పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. జూన్ 5 నంచి 7 వరకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 180 030 930 63 టోల్‌ఫ్రీ నెంబరులో సంప్రదించవచ్చు.


పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..