Tech Layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పర్వం 2024లోనూ కొనసాగుతూనే ఉంది. 2023లో టెక్ దిగ్గజాల‌తో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగ‌బ‌డ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీల‌పై లేఆఫ్స్ క‌త్తి వేలాడుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 32 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది. విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి.  తాజాగా స్నాప్ సంస్థ 540 మందిని తీసివేసింది. అంతకుముందు ఆక్టా అనే సాఫ్ట్‌వేర్ సంస్థ 400 మందిని ఇంటికి పంపింది. గూగుల్ (Google), అమెజాన్, సేల్స్‌ఫోర్స్, మెటా ప్లాట్‌ఫామ్స్ వంటి పెద్ద సంస్థలు సైతం ఉద్యోగాల కోత విధించిన జాబితాలో ఉన్నాయి. యూపీఎస్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌(Microsoft), అమెజాన్‌, సేల్స్‌ఫోర్స్‌, మెటా, అసెంచర్‌ వంటి పెద్ద సంస్థలు కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వేలాది మందిని తొలగించినట్లు పేర్కొంది.


కరోనా మహమ్మారి సమయంలో వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా టెక్ కంపెనీలు అప్పట్లో పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వ్యవస్థాపకుడు రోజర్ లీ తెలిపారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవటంతో వ్యయ నియంత్రణలో భాగంగా అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని పేర్కొన్నారు. అధిక వడ్డీరేట్లు, టెక్ పరిశ్రమలో గిరాకీ కొరత ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగడం పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించారు.


ఉద్యోగాల కోతకు ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని లీ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు రూపాంతరం చెందాల్సిన అవసరం వల్లే మానవ వనరులను క్రమబద్ధీకరించాల్సి వస్తోందని కొన్ని కంపెనీలు చెబుతున్నట్లు గుర్తు చేశారు. టెక్ పరిశ్రమలో నియామకాల వివరాలను వెల్లడించే CompTIA అనే సంస్థ ఇదే విషయాన్ని తెలియజేసింది. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్లు పేర్కొంది. కొన్ని రకాల పోస్టులను తీసివేస్తున్నప్పటికీ.. మరికొన్ని రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని తెలిపింది. జనవరిలో దాదాపు 33,727 నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపింది. నివేదిక ప్రకారం.. ఏఐ రీసెర్చర్, సీనియర్ అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్, ఏఐ టెక్నికల్ సొల్యూషన్స్ లీడ్, మెషిన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రోబోటిక్స్ అల్గారిథమ్స్ ఇంజనీర్, జెనరేటివ్ ఏఐ క్వాలిటీ ఇంజనీర్, ఏఐ లెర్నింగ్ ఇంజనీర్, మ్యాచింగ్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల లభ్యత ఎక్కువగా ఉన్న ఏఐ సంబంధిత రోల్స్ ఉన్నాయి.


ఫైనాన్షియల్‌ టెక్నాలజీ దిగ్గజం పేపాల్‌ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు జనవరి చివర్లో ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈవో అలెక్స్‌ క్రిస్‌ (Alex Chriss) లేఖ రాశారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని లేఖలో వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్‌ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్‌ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని ఈ సందర్భంగా క్రిస్‌ పేర్కొన్నారు.


వివిధ పరిశ్రమలలో ముఖ్యంగా టెక్ సెక్టార్‌లో విస్తృతంగా తొలగింపులు కొనసాగాయి. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆదాయం తగ్గడం, ఉద్యోగ అనిశ్చితి, పెరిగిన ఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను విస్తరించాయి. అయితే ఈ భయాందోళనలు అంతంత మాత్రంగానే కనిపించడం లేదు. ప్రపంచం 2024 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ ఉద్యోగుల తొలగింపు అనేది అంతం కాలేదు.