తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్.జగదీశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ ఓఎస్‌డీగా ఉన్నారు. డిప్యూటేషన్‌పై వచ్చిన జగదీశ్వర్‌రెడ్డి రెండేళ్లు టీఎస్‌పీఎస్సీలో కొనసాగనున్నారు.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కమిషన్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, జవాబుదారీతనం పెంచి, నియామక ప్రక్రియను బాధ్యతాయుతంగా పూర్తి చేసేందుకు సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఇటీవల అదనంగా పది పోస్టులను మంజూరు చేసింది. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.


దేశవ్యాప్తంగా పీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఉండాలని యూపీఎస్సీ గతంలోనే సిఫార్సు చేసింది. ఈ పోస్టులో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని, ఆయన సొంత రాష్ట్రానికి చెందకూడదని సూచించింది. ఈ మేరకు ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టులను సృష్టించారు. తమకు సైతం ఈ పోస్టును మంజూరు చేయాలని టీఎస్‌పీఎస్సీ గతంలోనే ప్రభుత్వానికి విన్నవించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌, అదనపు కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి బీఎం సంతోష్‌ను నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌గా ఎన్‌.జగదీశ్వర్‌ రెడ్డి నియమించింది.


కొత్తగా 10 పోస్టుల మంజూరు..
భవిష్యత్తులో పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలు ఉండటంతో టీఎస్‌పీఎస్సీలో సైబర్‌ సెక్యూరిటీకి కమిషన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మేరకు ఐటీ ప్రొఫెషనల్స్‌తో శాశ్వత పోస్టులను భర్తీ చేయనుంది. వాటిలో చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారి నుంచి జూనియర్‌ ప్రోగ్రామర్‌ వరకు ఆరు పోస్టులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు ముగ్గురు ప్రత్యేక అధికారులు ఉంటారు. నిర్వహణ బాధ్యత పూర్తిగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌దే. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సైతం పరీక్షల కంట్రోలర్‌ పరిధిలోనే ఉంటుంది.


Also Read:


'గ్రూప్‌-4' మెయిన్ ఎగ్జామ్ మెరిట్‌ జాబితా విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల ప్రధాన పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్ష ఏప్రిల్‌ 4న రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష సమాధానాల ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ సైతం ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు. విద్యార్థుల మార్కుల జాబితాతో పాటు.. రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


ఎన్‌టీపీసీలో 120 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టులు - అర్హతలివే!
 న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, ఏసీఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మే 23 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు నియామక పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..