తెలంగాణలో ఇప్పటి వరకూ 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగ‌తి భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్... త్వరలో 40 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇస్తున్నామన్నారు. కొత్త జోన‌ల్ విధానం తీసుకోచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అందువల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ద‌క్కేలా చేశామన్నారు. మ‌ల్టీ జోన‌ల్ పోస్టింగ్ విధానం తీసుకోచ్చామని కేసీఆర్ అన్నారు. దీని ద్వారా 5 శాతం మాత్రమే నాన్ లోకల్స్ కు ఇచ్చామన్నారు. పరిపాలన తెలియని వాళ్లంతా 317 జీవోపై విమర్శలు చేస్తున్నారన్నారు. కొంత‌మంది ఉద్యోగులు స్వార్థంతో ఒక చోటే ఉంటామ‌ని అంటున్నారన్నారు. 317 జీవో గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను లాగి కొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. స్థానిక నిరుద్యోగుల‌కు 317 జీవో వ‌ల్ల ఉద్యోగ అవ‌కాశాలు వ‌స్తాయన్నారు. 


బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తా


బీజేపీ పాలన అంటే దేశాన్ని అమ్ముడు, మతపిచ్చి లేపుడు, రాజకీయపబ్బం గడుపుకొనుడు, ఇతర పార్టీలపై ఏడుపుడు.. అని సీఎం కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చిందో వాటిలో ఎంత దారుణంగా విఫలం అయిందో చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్.  'రైతుల ఆదాయం డబుల్‌ చేస్తామన్నారు. అయిందా. హౌసింగ్ ఫర్‌ ఆల్ అన్నారు. అయిందా. బ్లాక్‌మనీ తెస్తామన్నారు.. తెచ్చారా..?  బ్లాక్‌మనీ సంపాదించినోళ్లని దేశం దాటించారు.  బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తేనే దేశం బాగుపడుతుంది.' అని సీఎం కేసీఆర్ అన్నారు. 


చెత్త పాలసీ 


నదుల అనుసంధానంపై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. లాజిక్ లేని ఆలోచన చేశారన్నారు. గోదావరి కృష్ణా మధ్య ట్రిబ్యునళ్లలో వివాదం ఉందన్న ఆలోచన లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న నీటిని వాడుకోవడం చేతకావడం లేదన్నారు. తెలంగాణకు 65 వేల టీఎంసీల నీటిని వినియోగించుకునే వీలుందన్న సీఎం కేసీఆర్... దేశంలోని వాటర్‌ పాలసీల వల్ల 35 వేల టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామన్నారు.  ఇది కాంగ్రెస్-బీజేపీ అసమర్థత పాలన వల్లే అన్నారు. రామానుజ విగ్రహం పెట్టిందని చిన్నజీయర్ స్వామి అయితే దానిపై బీజేపీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. 


నదుల అనుసంధానం పనికిరాని ఆలోచన 


తెలంగాణలో దళితులకు కేంద్రం కంటే మూడు రెట్లు ఎక్కువ  ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తెలంగాణకు ఇన్నాళ్లుగా ఇచ్చిన డబ్బుకంటే ఒక్క రైతుబంధు కింద తాము పెట్టిన ఖర్చు ఎక్కువ అని చెప్పారు. తెలంగాణ ఒక రోల్ మోడల్ అనిచెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో 14 గంటలు రైతులకు ఇస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలం అయిందని చెప్పడంతో పాటు.. తాను ఆదర్శవంతమైన పాలన ఇచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. దేశంలోని నీటి వనరులను సరిగ్గా వాడుకోలేకపోయారరని నదుల అనుసంధానం పనికిరాని ఆలోచన అని చెప్పడం ద్వారా జాతీయ సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు.