దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ అధికారుల దర్యాప్తులో తేలడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగనుంది. ఈ మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనుంది. దీంతోపాటు సైబరాబాద్ పోలీసులు బయటపెట్టిన డేటా లీకేజీపైనా మరో కేసు ఈడీ నమోదు చేసింది.


దర్యాప్తులో కీలక ఆధారాలు..
రాష్ట్రంలో 'గ్రూప్-1' ప్రిలిమ్స్ సహా పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన 'సిట్' చేపట్టిన దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించాయి. టీఎస్‌పీఎస్సీ మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్.. తన స్నేహితురాలు రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ఇచ్చి ప్రతిఫలంగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌లు దీన్ని మరో అయిదుగురికి అమ్ముకొని దాదాపు రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకొందరికీ ప్రశ్నపత్రం అమ్ముకొని ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రానికి సంబంధించిన లావాదేవీల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోనుడడం గమనార్హం.


డేటా చౌర్యం కేసులోనూ..
దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా చోరీ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం ఉండటంతో.. ఆ శాఖ దర్యాప్తు జరుపుతోంది. డేటా విక్రయంలో పెద్దమొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు వెల్లడి కాలేదు. కానీ, కోట్ల మందికి సంబంధించిన డేటా చేతుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాపారం కూడా భారీగానే జరిగి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. అన్నింటికీ మించి డేటా చౌర్యం వెనక గాని, కొనుగోలు చేసినవారి వెనక గాని ఏదైనా ఉగ్రకోణం ఉందా? అనేది దర్యాప్తు సంస్థలను వేధిస్తున్న ప్రశ్న.


అనుమానాస్పద లావాదేవీలపై నజర్..
అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది. కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ నుంచి గానీ, న్యాయస్థానం నుంచి గానీ ఎఫ్‌ఐఆర్ పొంది.. శుక్రవారం ఈసీఐఆర్(ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన నిందితులను ఈడీ అధికారులు మరోమారు విచారించడానికి, అవసరమైతే అరెస్టు చేయడానికీ అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కేసులో ఇంకెవరికైనా ప్రమేయం ఉందని గాని, దీనికి సంబంధించిన సమాచారం గాని తెలుసని భావిస్తే వారికి నోటీసులు జారీ చేసి విచారించడానికీ వీలుంది.


Also Read:


➥ గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!


➥ గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!


➥ వాట్సాప్ ద్వారానే 'గ్రూప్-1' ప్రశ్నపత్రాలు చేరవేశారు! కమిషన్ కార్యాలయం నుంచే మొత్తం వ్యవహారం!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...