విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (Andhra Pradesh State Cooperative Bank- APCOB) 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ (స్కేల్‌-1),  స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జూలై 21న ప్రారంభం కాగా.. ఆగస్టు 5వ తేదీతో ముగియనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.apcob.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.



ఖాళీల వివరాలు..
మేనేజర్‌ (స్కేల్‌-1): 26 (6 స్పెషలైజేషన్ పోస్టులు)
వీటిలో ఆరు పోస్టులకు స్పెషలైజేషన్ అవసరమని తెలిపింది. అగ్రికల్చర్‌ (3), హార్టికల్చర్‌ (1), వెటర్నరీ (1), ఫిషరీస్‌ (1) విభాగాల్లో స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.  
స్టాఫ్‌ అసిస్టెంట్లు: 35



విద్యార్హత.. 
40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా తప్పనిసరి.
ముఖ్యమైన వివరాలు:
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయసు: జూన్‌ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది)
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500, మిగతా వారు రూ.700 చెల్లించాలి. 
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 5, 2021
ఆన్‌లైన్‌ పరీక్ష: 2021, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://www.apcob.org/
పరీక్ష విధానం.. 
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ (30 ప్రశ్నలు), రీజనింగ్ (35 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు) విభాగాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలుగా ఉంది. 
పరీక్ష కేంద్రాలు..
విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. 
ఎస్ఎస్‌సీలో 25,271 కానిస్టేబుల్ జాబ్స్..
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారని తెలిపింది.